Telangana High Court stays CBI court sentence - huge relief for Gaali

ఓబులాపురం మైనింగ్‌ కేసులో గాలి జనార్థన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఉపశమనం లభించింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను నిలుపుదల చేసింది. గాలి జనార్దన్‌ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ కోసం కొన్ని షరతులు విధించింంది. పదిలక్షల రూపాయల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, బెయిల్‌ సమయంలో దేశం విడిచి ఎక్కడికీ వెళ్ల కూడదని, పాస్‌పోర్టు సరెండర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.



సీబీఐ కేసును కొట్టి వేయాలంటూ గాలి జనార్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు సీబీఐ కోర్టు తీర్పుపై సస్పెన్షన్ విధించకపోతే తన నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని గాలి జనార్థన్‌రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు తీర్పు వెలువడగానే గాలి జనార్థన్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. బళ్లారి నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.



దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ యేడాది మార్చి 6వ తేదీన తుది తీర్పు వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్‌ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆతర్వాత సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తుది తీర్పులో ప్రకటించింది. గాలి జనార్దన్‌రెడ్డితోపాటు బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా ప్రకటిస్తూ.. శిక్షలు ఖరారు చేసింది. వీరికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో.. గాలి జనార్ధన్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా.. హైకోర్టు శిక్షను నిలుపుదల చేసి.. బెయిల్ మంజూరు చేయడంతో.. గాలి జనార్థన్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నారు.




Politent News Web4

Politent News Web4

Next Story