Telugu professor Madhavilatha in the construction of Chenab Bridge

ఎవరీ మాధవీ లత..? చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగు ప్రొఫెసర్ కీలక పాత్ర..!

జమ్మూ కశ్మీర్ లోని చీనాబ్ ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ప్రారంభం..

చీనాబ్ వంతెన నిర్మాణంలో 17 ఏళ్లుగా తెలుగు ప్రొఫెసర్ జి. మాధవీ లత సేవలు..

ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్, జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు..

క్లిష్టమైన భూ పరిస్థితుల్లో "డిజైన్ యాజ్ యూ గో" పద్ధతిలో రూపకల్పన..

కశ్మీర్ లోయ అనుసంధానతకు ఈ వంతెన ఓ మైలురాయి..

రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మాణం, ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైనది. జమ్మూకశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, చీనాబ్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టు విజయవంతం కావడంలో బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్, తెలుగింటి ఆడపడుచు జి. మాధవీ లత కీలక పాత్ర పోషించారు. సుమారు 17 సంవత్సరాల పాటు జియో టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఆమె ఈ ప్రాజెక్టుతో మమేకమై పని చేశారు.

ప్రొఫెసర్ మాధవీ లత నేపథ్యం..

ప్రస్తుతం ఐఐఎస్‌సిలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ మాధవీ లత ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1992లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్‌తో బీటెక్ పూర్తి చేశారు. వరంగల్‌ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అభ్యసిస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. 2000 సంవత్సరంలో ఐఐటీ-మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌ లోనే డాక్టరేట్ పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2021లో ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి 'బెస్ట్ ఉమెన్ జియో టెక్నికల్ రీసెర్చర్' అవార్డు అందుకున్నారు. 2022లో 'టాప్ 75 ఉమెన్ ఇన్ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్) ఆఫ్ ఇండియా' జాబితాలో కూడా స్థానం సంపాదించారు.

చీనాబ్ ప్రాజెక్టులో కీలక భూమిక..

చీనాబ్ వంతెన నిర్మాణం చేపట్టిన ప్రాంతం లోని క్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రదేశం కావడం వంటి అంశాలు నిర్మాణాన్ని అత్యంత సవాలుగా మార్చాయి. ప్రొఫెసర్ మాధవీ లత, వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్‌కాన్స్‌ సంస్థతో కలిసి ప్రణాళిక, డిజైన్ మరియు నిర్మాణ దశల్లో భూ సంబంధమైన ఆటంకాలను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఆమె బృందం 'డిజైన్ యాజ్ యూ గో' అనే వినూత్న విధానాన్ని అనుసరించింది. ప్రాథమిక సర్వేలలో కనిపించని విరిగిన రాళ్లు, రహస్య ఖాళీ ప్రదేశాలు, వివిధ రకాల రాతి లక్షణాలు వంటి వాస్తవ భూగర్భ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్‌లో మార్పులు చేస్తూ ముందుకు సాగారు. నిర్మాణ సమయంలో ఎదురైన యథార్థ రాతి పరిస్థితులకు అనుగుణంగా సంక్లిష్టమైన గణనలు, డిజైన్ సవరణలు చేశారు. వంతెన స్థిరత్వాన్ని పెంచడానికి రాక్ యాంకర్ల రూపకల్పన, వాటిని అమర్చాల్సిన ప్రదేశాలపై ఆమె అందించిన సలహాలు అమూల్యమైనవి.

ఇటీవలే ఇండియన్ జియో టెక్నికల్ జర్నల్ మహిళా ప్రత్యేక సంచికలో 'డిజైన్ యాజ్ యూ గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్' అనే పేరుతో ఆమె ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. స్థలం లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, వంతెన మొత్తం నిర్మాణం, ప్రదేశం, రకం స్థిరంగా ఉండగా, డిజైన్ ఎలా నిరంతరం రూపాంతరం చెందిందో ఈ పత్రం వివరిస్తుంది.

చీనాబ్ వంతెన.. కొన్ని విశేషాలు..

సుమారు రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ వంతెనను 'భారత దేశ రైల్వే ప్రాజెక్టుల చరిత్రలో ఎదురైన అతిపెద్ద సివిల్-ఇంజనీరింగ్ సవాలు'గా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. 359 మీటర్ల ఎత్తుతో, ప్యారిస్‌ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఈ వంతెన నిర్మితమైంది. ఈ ప్రాజెక్టు 2003లో ఆమోదం పొందిన 272 కిలోమీటర్ల ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (యుఎస్‌బి‌ఆర్‌ఎల్) లో భాగం. ఈ వంతెన కశ్మీర్ లోయలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగు పరుస్తుంది..

Updated On 9 Jun 2025 11:10 AM IST
Politent News Web3

Politent News Web3

Next Story