• ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహరించారన్న వార్తల్లో నిజంలేదు
  • ఆర్మీ మాకెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు..
  • ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఆయుధాలు పెట్టలేదు
  • నియమ నిబంధనలన్నీ యధాప్రకారం కొనసాగుతున్నాయి
  • బ్లాక్ అవుట్ నేపధ్యంలో మందిరాలపై లైట్లు ఆర్పేయమన్నారు
  • నియమానుసారం ఉంచాల్సిన చోట ఉంచి ఆపని చేశాం
  • అంతకు మించి మరే మార్పులు చేయలేదు
  • ఆలయ విశ్వాసాలను దెబ్బతీయలేదు
  • పవిత్రాలయంపై ఇలాంటి ప్రచారం తగదు
  • ప్రభుత్వం కూడా దీనిపై ప్రకటన చేయాలి
  • శిరోమణి అకాలీదళ్ ప్రభందక్ కమిటీ విస్పష్ట ప్రకటన
  • మీడియా వార్తలను ఖండించిన ఆర్మీ

ఇప్పటికే యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయెన్సర్ల ద్వారా తమకిష్టమైన నెరేటివ్స్ బిల్డప్ చేస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు ఆలయాలపై దుష్ర్పచారాన్ని చేసే నెరేటివ్స్ బిల్డ్ చేసి వదులుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. తాజా సంఘటనే అందుకు ఉదాహరణ. ఆపరేషన్ సిందూర్ టైమ్ లో అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ ని అనుమతించారా? పాకిస్థాన్ ద్రోణ్ దాడుల ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి స్వర్ణ దేవాలయ ప్రాంగణంలోకి ఎయిర్ డిఫెన్స్ గనులను ఎదురు దాడికోసం అనుమతించారన్న వార్తలు కొన్ని మీడియాలలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు నిరాధారమని, సత్యదూరమని ఆర్మీ స్పష్టతనిచ్చింది. అమృత్ సర్ లో ఎయిర్ డిఫెన్స్ గన్స్ లేదా ఎయిర్ డిఫెన్స్ పరికరాలు మొహరించామని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్ సర్ లో ఎలాంటి పరికరాలు మేం మొహరించలేదు అని ఆర్మీ స్పష్టమైన ప్రకటన చేసింది.

అంతకుముందు స్వర్ణాలయ ప్రధాన పూజారి, సిక్కుల అత్యున్నత మతపరమైన కమిటీ ఎయిర్ డిఫెన్స్ గన్ లను మోహరించేందుకు స్వర్ణాలయం ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని వివరణ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న టైమ్ లోనూ,తదనంతర ఉద్రిక్తతల సమయంలోనూ కీలక స్థావరాలు, మతపరమైన ప్రార్ధనాసంస్థలపై లైట్లు ఆర్పి ఉంచమని మాత్రం ఆర్మీ యంత్రాంగం తమను సంప్రదించిందని ఆమేరకు ఆలయ మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని, ఆ సంప్రదాయాలు,నియమాల ఉల్లంఘన జరగకుండా ఆర్మీకి తమ ఆలయ పెద్దలు పూర్తిగా సహకరించారని ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి తెలిపారు. హర్ మందిర్ సాహెబ్ ప్రాంగణంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఏర్పాటు చేస్తామని ఏ ఆర్మీ అధికారి తమను సంప్రదించలేదని ధామి వివరించారు. హర్ మందిర్ సాహెబ్ ప్రధాన అధిపతి గ్యానీ రఘు వీర్ సింగ్ అటువంటి ప్రతిపాదనలేవీ ఆర్మీనుంచి తమకు రాలేదని,కేవలం భద్రతా చర్యల్లో భాగంగా ప్రధాన ప్రార్ధనాలయాలపై లైట్లు ఒక నిర్దేశిత సమయంలో ఆర్పేయాలని మాత్రమే సూచనలు వచ్చాయని మందిర నియమాలననుసరించి ఆ సూచన పాటించామని వివరణ ఇచ్చారు. సిక్కుల మత విశ్వాసాలు, ఆచారాలకనుగుణంగా దీపాలు ఉంచాల్సినచోట అలాగే ఉంచి మిగిలిన చోట్ల తీసేశామని తెలిపారు. ఇటీవల కాలంలో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ ఆలయ నిబంధనల పరిరక్షణలో అసలు రాజీ పడలేదని అదే అంకిత భావంతో, అదే క్రమ శిక్షణతో ఆలయ సంప్రదాయాలు కొనసాగుతున్నాయని ఆలయ కమిటీ ప్రకటించింది. ప్రాంగణం బయట ఉన్న విద్యుద్దీపాలు మాత్రమే అదీ నిర్దేశిత వేళలలో ఆర్పాంతప్పితే మరే ఇతర సంప్రదాయాలను ఉల్లంఘించలేదని ధామీ వివరించారు. బ్లాక్ అవుట్ డేస్ లోకూడా ఆలయ రద్దీ తగ్గలేదని భక్తులు, మత విశ్వాసులు యధా ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారని ఆలయ కమిటీ చెప్పింది.సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రంపై ఇలాంటి అసత్య కథనాలతో కూడిన ప్రచారం ఎంత మాత్రం క్షేమకరం కాదని ధామీ అన్నారు.దీనిపై ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated On 23 May 2025 1:45 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story