ఎంత ప్రయాణానికి అంతే టోల్ చార్జీలు

- కొత్త టోల్ విధానాన్ని తెస్తున్న కేంద్ర ప్రభుత్వం
- ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్
వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్నిప్రవేశపెడుతున్నారు. ఇకపై వాహనదారులు తాము ప్రయాణించిన దూరాన్ని బట్టి మాత్రమే టోల్ రుసుము చెల్లించాలి. కేంద్రప్రభుత్వం త్వరలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ కొత్త టోల్ విధానం వల్ల నేషనల్ హైవేస్ పై ప్రయాణించే వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. ఈ కొత్త టోల్ విధానాన్ని రానున్న వారం లేదా పది రోజుల్లో ప్రవేశపెట్టడానికి నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న విధానం కన్నా మరింత పారదర్శకంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా మార్చడమే కొత్త టోల్ విధానం లక్ష్యంగా చెపుతున్నారు. వాహనదారులు టోల్ రహదారులపై తాము ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించడం కొత్త టోల్ విధానంలో కీలకమైన మార్పు. అంటే ఒక వాహనదారుడు జాతీయ రహదారిపై ఐదో లేక పదో కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినట్లైతే దానికి అనుగుణంగానే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా పూర్తి టోల్ స్లాబ్ను చెల్లించాల్సిన పరిస్థితి ఇకపై ఉండదు.
ప్రస్తుతం ఒక టోల్ ప్లాజాను దాటితే, ఎంత దూరం ప్రయాణించినా మరో టోల్ ప్లాజా వరకూ ఉన్న దూరానికి సంబంధించిన నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొత్త విధానంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు అవుతుంది. కొత్త వ్యవస్థలో ప్రతి టోల్ బూత్ వద్ద అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. అదే సమయంలో, ఫాస్టాగ్ ద్వారా వాహనదారుల బ్యాంకు ఖాతా నుండి టోల్ మొత్తం ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఈ సాంకేతికత ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్లను కలిపుకుని పనిచేస్తుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే పొడవైన క్యూలు, ట్రాఫిక్ జామ్లు ఇకపై కనిపించవు. అంతే కాకుండా, టోల్ అక్రమ వసూళ్ళు, మోసాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది. ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద ఆగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.
ఈ కొత్త టోల్ విధానం ప్రస్తుత వ్యవస్థతో పోలిస్తే మరింత పారదర్శకంగా, వినియోగదారునికి అనుకూలంగా ఉంటుంది. టోల్ మొత్తం నేరుగా వాహన యజమాని ఖాతా నుండి కట్ అవుతుంది. కాబట్టి నగదు లావాదేవీలు, వివాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులు పదే పదే ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ కొత్త విధానం ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, ట్రాఫిక్ జామ్లు, ఇంధన వృధా, సమయం వృధాను కూడా తగ్గిస్తుంది. కొత్త టోల్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రహదారులపై ప్రయాణించడం గతంలో కంటే మరింత చౌకగా, వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనే అంచనా ఉంది. దానికి కారణం వస్తువుల రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి.
