TVK Vijay: తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ గవర్నర్‌కు లేఖ రాస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని అభ్యర్థించారు. తమకు అవసరమైన మెజారిటీని రెండు వారాల్లో నిరూపిస్తామని ఆయన తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, మెజారిటీకి 118 సీట్లు అవసరం. విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ పూర్తి మెజారిటీకి ఇంకా కొద్ది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది.

ఇందుకోసం స్వతంత్రులు మరియు చిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు టీవీకే కృషి చేస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవులు, అభివృద్ధి హామీలతో మద్దతు కూడగట్టే వ్యూహాన్ని రూపొందించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

డ్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన టీవీకే ఈ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఇతర పార్టీల అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గుచూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గవర్నర్‌కు లేఖ పంపిన విజయ్‌కు మెజారిటీ నిరూపించుకోవడానికి రెండు వారాల గడువు కీలకంగా మారింది. ఈ సమయంలో మద్దతు కూడగట్టడమే ప్రభుత్వం ఏర్పాటు దిశగా నిర్ణయాత్మకంగా నిలవనుంది.

Next Story