మెగా డీఎస్సీ పరీక్షా కేంద్రాల కోసం కసరత్తు

ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతోంది. ఇచ్చిన గడువుకంటే ముందే పరీక్షల నిర్వహణ పూర్తి చేసేలా అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ 40 నుంచి 50 వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంతో మెగా డీఎస్సీ-2025గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 15వ తేదీతో ఆన్లైన్ దరఖాస్తుల నమోదు గడువు పూర్తయింది. దీంతో, డీఎస్సీకి ఎంత మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారన్న డేటా అధికారులు ఇప్పటికే తయారు చేశారు. దీంతో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడంపై దృష్టి సారించారు.
అధికారిక సమాచారం మేరకు.. ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ అయాన్ సంస్థతో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6వ తేదీ నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు ఈ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతో పాటు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా డీఎస్సీఈ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వారితో కూడా సంబంధిత అధికారులు సంప్రదింపులు పూర్తిచ చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్, షెడ్యూల్ మార్పులు లేకుండా.. అధికారులు ముందుకెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే.. పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తిచేసేలా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అయాన్ కేంద్రాలు ఎంపిక చేయగా.. రోజుకి సరాసరి 20 వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఆ సంస్థకు ఉదంటున్నారు. వీటితోపాటు ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే.. మరో 20 నుంచి 30 వేల మందికి ఒకేరోజు పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్నా.. గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే అని అధికారులు చెబుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఈ డీఎస్సీ నోటిఫికేషన్ నుంచే అమలు చేస్తున్నారు. ఆ మేరకు పోస్టులను ప్రకటించగా.. ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నది కూడా అధికారులు తెలియజేశారు. ఎస్సీ జీఆర్ 1 కేటగిరీలో 1,848మంది, జీఆర్ 2 కేటగిరీలో 45,419 మంది, జీఆర్ 3 కేటగిరీలో 61,905 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు చేసుకున్నారు. అంటే.. ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడనున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక, ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుషుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్, డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్టికెట్లు విడుదల చేస్తామని ఆయన చెప్పారు.డీఎస్సీ పోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆ జిల్లాలో మొత్తం 2,678 పోస్టులు ఉండగా.. 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టులు 673 ఉండగా... 15,993 మంది అభ్యర్థుల నుంచి 28,772 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడే అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి.
