Balkampet Yellamma Kalyanam arrangements... War between the ruling and opposition parties

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకల ఏర్పాట్లు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. మాజీమంత్రి శ్రీనివాస యాదవ్ 2025 ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించటం వివాదానికి దారి తీసింది. హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేకుండా సమీక్ష నిర్వహించటంతో ఇంచార్జి ఈవోను సస్పెండ్ చేశారు. బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని… స్థానిక ఎమ్మెల్యేగా శ్రీనివాస యాదవ్ సమీక్ష నిర్వహిస్తే అధికార పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఈ రోజు(సోమవారం) హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి బల్కంపేట వచ్చారు. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం లో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం 2025పై అధికారులతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తలసాని ప్రసంగించినా ముక్తసరిగా ముగించారు.
సోమవారం జరిగిన సమావేశంలో ఇద్దరు నేతలు పాల్గొన్నా… అంతర్గతంగా ఇద్దరు నేతల అనుచరుల మధ్య వాగ్వదం జరుగుతోంది. ఇద్దరు నేతల వ్యవహారంతో దేవాలయం సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అనే భయంతో ఎవరు మీడియాతో మాట్లాడటం లేదు. దీంతో ఈ వ్యవహారం అధికార, విపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలకు దారితీస్తోంది.
ఎల్లమ్మ కళ్యాణం జూన్ ఒకటో తేదీన ఉండగా ఆనాటికి అధికార విపక్షాల నేతలు సంయమనం పాటించాలని భక్తులు కోరుతున్నారు.
