బనకచర్ల వివాదం - అడకత్తెరలో పోకచెక్కలా తెలంగాణ బీజేపీ
Banakacharla controversy - headache to Telangana BJP

బనకచర్ల అంశం రాజకీయ వివాదంగా మారింది. అంతకుమించి రెండు రాష్ట్రాల సమస్యగా రూపు దిద్దుకుంది. మరోవైపు.. భారతీయ జనతాపార్టీకి పంటికింద రాయిలా పరిణమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై బనకచర్ల వద్ద ప్రాజెక్టును ప్రతిపాదించింది. కేంద్ర జలవనరుల శాఖకు ఆ ప్రతిపాదనలు పంపించింది. ఇటు.. తెలంగాణ ప్రభుత్వం బనకచర్లను అంగీకరించేదే లేదంటూ గొంతెత్తుతోంది. తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఏపీ సర్కారు ప్రయత్నాలను తప్పుబడుతున్నాయి. విమర్శలు చేస్తున్నాయి. మండిపడుతున్నాయి. కానీ, ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రం మింగలేక, కక్కలేక.. అన్నట్లు పరిస్థితి తయారయ్యింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతాపార్టీ భాగస్వామ్య పార్టీగా ఉంది. అంటే.. బనకచర్ల ప్రాజెక్టుకు బీజేపీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తోందన్నమాటే. అదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు, ఏపీ సర్కారుకు మంచి టర్మ్స్ కొనసాగుతున్న కారణంగా కేంద్రం ఏమాత్రం అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
అయితే, ఇదే సమయంలో తెలంగాణలో బనకచర్లపై రగడ కొనసాగుతోంది. ఇక్కడ భారతీయ జనతాపార్టీ ప్రతిపక్షంలో ఉంది. అధికార పక్షం సహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు ముక్తకంఠంతో బనకచర్లను వ్యతిరేకిస్తున్న సమయంలో బీజేపీ ఏ స్టాండ్ తీసుకోని సందిగ్ధ పరిస్థితిలో పడిపోయింది. అటు.. కేంద్రంలోనూ, ఇటు.. ఆంధ్రప్రదేశ్లోనూ బనకచర్లను బీజేపీ సమర్థిస్తుండగా.. తెలంగాణ బీజేపీ నాయకులు సొంతంగా విమర్శించలేని పరిస్థితి నెలకొంది. అందుకే కొన్నాళ్లుగా బీఆర్ఎస్ బనకచర్లను ఓ అస్త్రంగా వాడుకుంటున్న సమయంలో బీజేపీ మాత్రం దాటవేసే ధోరణిని అవలంబిస్తోంది. ఈ అంశంపై బీజేపీ తెలంగాణ ముఖ్యులను మీడియా కదిలించినా.. ఇంకా నిర్ణయమేదీ జరగలేదు కదా.. అంటూ కొట్టి పారేస్తున్న పరిస్థితి ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది. ఈ రౌండ్టేబుల్ సమావేశానికి స్వయంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎంపీలందరినీ ఆహ్వానించారు. ఈ సమయంలో ఈ సమావేశానికి బీజేపీ నుంచి ఎంపీలు హాజరవుతారా? లేదా? అన్నది చివరిదాకా ఉత్కంఠ నెలకొంది. అయితే, బుధవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ జాతీయ స్తాయిలో స్టాండ్, తెలంగాణలో స్టాండ్ ఎలా ఉందన్న అంశాలపై చర్చించి ఎంపీలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలను అఖిలపక్ష సమావేశానికి పంపించాలని నిర్ణయించారు. దీంతో, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు బీజేపీ తరపున తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్పార్టీ నుంచి ఎంపీలు రేణుక చౌదరి, బలరాం నాయక్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్, రామ సహాయం రఘురాంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాగా బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు జరిగే నష్టాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ బనకచర్లపై అగ్గిమీద గుగ్గిలంగా వ్యవహరిస్తుండగా.. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా తనదైన శైలిలో నిరసనలు తెలుపుతూ.. సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చర్చను లేవనెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ మాత్రం అటు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను సమర్థించలేక, విమర్శించలేక సతమతమవుతోంది. తెలంగాణ నుంచి బీజేపీలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలున్నా.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంాణకు జరిగే నష్టాన్ని కేంద్రానికి వివరించలేక పోతున్నారు. ఈ పరిణామాలు తెలంగాణలో బీజేపీపై విమర్శలకు కారణమవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
