8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ కారిడార్
Chief Minister Chandrababu Naidu at the review meeting of joint Visakhapatnam district workers

ఏడాదిగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను కాలర్ ఎగరేసుకుని చెప్పాలని చంద్రబాబు అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ..”ఏడాదిలో 750 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ఏ రాష్ట్రంలోనూ చేయనంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తోంది. మా ప్రభుత్వం చేసిన మంచిపనులు ఇవీ అని కాలరు ఎగరేసి చెప్పండి. ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ప్రజల వద్దకు వెళ్లి చెప్పారు. ప్రజలకు కార్యకర్తలు ఇచ్చిన మాటను నిలబెడతా. కార్యకర్తల గౌరవం పెంచేలా పని చేస్తా. వచ్చే జన్మలోనూ టీడీపీ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నా. కార్యకర్తలది నాది రాజకీయ బంధం కాదు కుటుంబ అనుబంధం. సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే టీడీపీని ఎవ్వరూ ఏం చేయలేరు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తక్కువ సమయం కేటాయించినపుడు కార్యకర్తలు అలిగారు. టీడీపీ కార్యకర్తలు అలిగి ఇంట్లో కూర్చుంటారు కానీ వేరే పార్టీకి ఓటేయరు. కార్యకర్తలు అలిగినప్పుడు పార్టీ ఓడిపోయింది. ఇకపై కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వను. టీడీపీ ఓడిపోయే పరిస్థితి రాదు.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏడాది పాలన పూర్తైంది.. తొలి అడుగు వేశాం
ఎన్నో సవాళ్లు ఉన్నా.. ప్రజలు మెచ్చే విధంగా పాలన అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. “గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఒక్క మాటలో చెప్పలేం. విశాఖలో తహసిల్దార్ కార్యాలయం, కలెక్టర్ ఆఫీసు, ప్రభుత్వాస్పత్రి సహా కనిపించిన ప్రతీ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా వైసీపీ వాడేసింది. రాష్ట్రానికి చికిత్స చేయమని ఎన్డీఎకు ప్రజలు అవకాశం ఇచ్చారు. వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ చెప్పుకుని తిరిగిన వ్యక్తికి విశాఖ ప్రజలు తగిన బుద్ది చెప్పారు. అభివృద్ధి చేసి ఆదాయం సృష్టించి సంక్షేమం చేస్తామనేది కూటమి ప్రభుత్వ నినాదం. పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఒకే రోజు రూ. 10 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం వేసిందని కాలరు ఎగరేసి ఘనంగా చెప్పండి. పేదల సేవలో భాగంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందచేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా ఏడాదికి రూ.34 వేల కోట్లు ఇస్తున్నాం. గతంలో చెత్త ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై కూడా పన్నేసింది. దాన్ని రద్దుచేశాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తొలిరోజే సంతకం చేశాం. భర్తీ ప్రక్రియ జరుగుతోంది. దీపం 2 ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభం అవుతుంది. జూన్ 20 తేదీన అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆర్ధిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నాం. రాష్ట్రంలో ప్రజా హిత పాలన ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ”అంటూ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని టీడీపీ అధినేత వివరించారు.
బ్రాండ్ విశాఖ... కూటమి ప్రభుత్వ ఆలోచన
విశాఖ అభివృద్ధి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. విశాఖ బ్రాండ్ ను పెంచితే ఆకాశమే హద్దుగా ఈ నగరం ఎదుగుతుంది. విశాఖ లాంటి సహజ సిద్ధనగరం రాష్ట్రానికే తలమానికం, రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వస్తున్న నగరం ఇది. ముంబైను మించిన స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటి విశాఖలోనే ఏర్పాటు కానుంది. మెట్రో రైల్ ప్రాజెక్టు వస్తుంది. టీసీఎస్, గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయి. డేటా హబ్ , డేటా అనలిటిక్స్ కేంద్రాలు రానున్నాయి. సింగపూర్ నుంచి విశాఖకు సీ కేబుల్ వేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ త్వరలోనే నిర్మితమవుతుంది.” అని చంద్రబాబు వెల్లడించారు.
సెంటిమెంటును కాపాడాం
స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాల్లో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సెంటిమెంటును కాపాడామని చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు. “స్టీల్ ప్లాంటుకు ప్రైవేటీకరణ గండం వచ్చిన ప్రతిసారీ మనమే కాపాడాం. సెంటిమెంటు నిలబెట్టాం. అలాగే రైల్వే జోన్ సమస్యను పరిష్కరించాం. రైల్వే జోన్ కోసం భూమి ఇమ్మని కేంద్రం కోరినా గత ప్రభుత్వం పట్టించు కోలేదు. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడింది. అమరావతి రాజధానిగా అభ్యంతరం లేదని చెప్పారు. ఆ తర్వాత మూడు ముక్కలు చేసి అమరావతినే కాదు.. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేసేందుకు కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కూటమి అభివృద్ధి ఆలోచనకు.. వైసీపీ విధ్వంస పాలనకు వ్యత్యాసం ఇదే” అని టీడీపీ అధినేత చెప్పారు.
నాటకాల రాయుడు మాటలు మారుస్తున్నాడు
పొదిలిలో రైతుల పరామర్శకంటూ వెళ్లి రౌడీయిజం చేశారు. నాటకాల రాయుడు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారని జగన్ వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. “పదవిలో ఉండి అధికారంతో రౌడీయిజం చేశారు. ఇప్పుడు రౌడీ షీటర్లను వెంటేసుకుని రౌడీయిజం చేస్తున్నారు. పరామర్శకు వెళ్లి రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసులపై దాడి చేస్తామంటే కుదరదు. తెనాలి వెళ్లి రౌడీలను పలకరించి వస్తారా..? పులివెందుల మార్కు రాజకీయం చేస్తామంటే తోక కట్ చేస్తాం. బాబాయిని చంపి చేసిన డ్రామాలేశారు. కోడికత్తి డ్రామా కూడా చూశాం. ఎన్నికల్లో టైమ్ లో గులకరాయి డ్రామా ఆడారు. ఇదంతా గతం.. ఇకపై వారి ఆటలు సాగవు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాటం చేస్తున్నాం. వారి ముసుగు తీస్తాం. ఈ పోరాటంలో ఎలాంటి రాజీ లేదు. అలాగే అవినీతి చేసిన వారినీ వదిలిపెట్టం. జగన్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అవినీతికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయి. భూ రికార్డులను గందరగోళం చేశారు. వేలాది పిటిషన్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో చేసిన అక్రమాల నిగ్గు తేలుస్తాం. భూ అక్రమాలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాం.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలంతా యోగా దినోత్సవంలో పాల్గొనండి
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. “జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా డే విశాఖ లో నిర్వహిస్తున్నాం. మీరంతా యోగా డేలో పాల్గోనాలి. 3.18 లక్షల మందికి ఆర్కే బీచ్ లో యోగాసనాలు వేసేందుకు మ్యాట్లు వేస్తున్నాం. దీన్ని విజయవంతం చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలి. ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమంలోనూ కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలి. అందుకే యోగా దినోత్సవానికి కార్యకర్తలంతా రావాలని కోరుతున్నా. పొలిటికల్ గవర్నెన్సు అంటున్నాను కాబట్టి ఏ పనిజరిగినా కార్యకర్తల ద్వారానే జరగాలి. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వానిది. త్వరలోనే దీనిపై ఓ ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. కార్యకర్తలందరినీ ఆర్ధికంగా పైకి తీసుకువచ్చే కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నాం.” అని చంద్రబాబు చెప్పారు.
