India First, Telangana First is our policy_BRS Working President KTR

దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీీ గర్వకారణం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. అధికారంలో ఉన్నా లేకున్నా.. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అన్న కేటీఆర్, ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానం అన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలన్నారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీ లో ఏర్పాటుచేసిన పిడిఎస్ఎల్ (Pragmatic Design Solutions Limited) నాలెడ్జ్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..తెలంగాణ విజయాల గురించి మాట్లాడటానికి ఎల్లప్పుడూ తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు PDSL కి ధన్యవాదాలు తెలిపారు. ఆటోమోబైల్ రంగంలో పిడిఎస్ఎల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. PDSL తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కోరిన కేటీఆర్, ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ, ఇండస్త్రీల మధ్య ఉన్న పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.




మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ, వార్విక్ యూనివర్సిటీ లో తన నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించుకోవడం తెలంగాణ టాలెంట్ కు నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే ఆటోమోటివ్ హబ్ గా పూణే, చెన్నైల సరసన హైదరాబాద్ నిలిచిందన్నారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్‌ తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. ఆటోమోటివ్ రంగంలో కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కే పరిమితం కాకుండా తయారీ రంగంలో కూడా తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలు ఉపయోగపడతాయన్నారు.

భారతదేశంలో ఫార్ములా E రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్న కేటీఆర్, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. తమ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా తెలంగాణ మారిందన్నారు. గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి కార్పోరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో ప్రారంభించాయని గుర్తుచేశారు. తమ తొమ్మిదేండ్ల కాలంలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతో పాటు ఇతర రంగాల్లోనూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందన్నారు. ఐటీ, దాని అనుబంధ రంగాలతో పాటు ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లోనూ మనదేశ యువత తమ ప్రతిభ,నిబద్ధతతో అద్భుతంగా రానిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థుల తో పాటు కంపెనీలు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు.

పిడిఎస్ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల మాట్లాడుతూ..కేటీఆర్ ఆలోచనలు, పనితీరు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. ఆయన చేసిన పనులు, తీసుకొచ్చిన విధానాలు ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగానికి చేసిన కృషి తో ఐటీ ఒక్కటే కాదు అనేక రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలబడిందన్నారు. అనేక దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి తన పనితీరు ఆలోచనా థృక్పథంతో గ్లోబల్ లీడర్ గా ఎదిగిన కేటీఆర్ చేతుల మీదుగా తమ నాలెడ్జ్ సెంటర్ ను ప్రారంభించుకోవడం తమ కంపెనీ కి అత్యంత గౌరవం అన్నారు క్రాంతి పుప్పాల.





నాలెడ్జ్ సెంటర్ నుు ప్రారంభించిన ఆనంతరం అక్కడ జరిగే కార్యకలాపాలను కేటీఆర్ పరిశీలించారు. తమ సంస్థ గురించి పిడిఎస్ఎల్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఆ తరువాత కంపెనీ సిబ్బంది,ఉద్యోగులతో కేటీఆర్ ఇంటరాక్ట్ అయ్యారు.

Updated On 31 May 2025 2:27 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story