జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం-వైఎస్.జగన్

గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వెఎస్.జగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాక తాము వైసీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని జగన్ అన్నారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతి, దోపిడీల మయంగా మారిందని జగన్ విమర్శించారు. నాణానికి రెండో వైపులా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్ధితులను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సంపద సృష్టించి సంక్షేమ పధకాలు ఇస్తా అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలన చూస్తుంటే సంక్షేమము కనిపించడం లేదు అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. గడచిన ఏడాదిగా రాష్ట్రలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయిందని తెలిపారు. రాష్ట్ర ఆదాయం అంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్లిపోతోందన్నారు. 12 నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని మండిపడ్డారు. పచ్చపత్రికలు, టీడీ ఛానళ్ళు మాఫియా రాజ్యాన్ని నడుపుతున్నాయన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా అబద్దాల వార్తలు రాస్తున్నాయని అవి టాయిలెట్ పేపర్ కు ఎక్కువ టిష్యూ పేపర్ కి తక్కువా అని తీవ్ర స్ధాయిలో విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్ మాఫియాలు నడుస్తున్నాయని మైనింగ్ నుంచి రాష్ట్ర ఖజానాకు రూపాయి రావడం లేదని తెలిపారు. ఏపీలో- జరుగుతున్న స్కాములకు పరాకాష్ట అమరావతి అన్నారు. అమరావతి పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని వైఎస్.జగన్ ఆరోపించారు. పనుల అంచనాలను అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు అడ్డు రాకూడదని వైసీపీ హయాంలో తెచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ తీసేశారని విమర్శించారు. పర్సంటేజీల కోసం మా హయాంలో లేని మొబలైజేషన్ అడ్వాన్సులను కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టిందన్నారు. అడ్వాన్సులంటూ పది శాతం ఇచ్చి ఎనిమిది శాతం పర్సంటేజిలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. 2018తో పోలిస్తే దాదాపు 105 శాతం ఎస్టిమేషన్లు పెంచారని విమర్శించారు. చదపు అడుగుకు రూ.8931 చెల్లిస్తున్నారంటే భవంతులు ఏమైనా బంగారంతో కడుతున్నారా అని వైఎస్.జగన్ ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం
చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ తనను ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్.జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. మధ్యం షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అని జగన్ నిలదీశారు. దుకాణలను 33 శాతం తగ్గిస్తే ఎక్కడైనా లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారని కానీ ఇప్పుడు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్నారు. గల్లీ గల్లీకి బెల్టు షాపులు వెలిశాయి, ఎమ్మెల్యేల కనుసన్నల్లో అవి నడుస్తు్న్నాయి... షాపులన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు… లిక్కర్ స్కామ్ ఇప్పుడు జరుగుతోందని జగన్ ఆరోపించారు. గతంలో లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఈరోజుకీ బెయిల్ మీద ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
విజయసాయి చంద్రబాబుకి లొంగిపోయాడు..
తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కామ్ సృష్టించాలని చూస్తు్న్నారని ఉద్యోగులను, నాయకులను బెదిరించి వాగ్మూలాలు తీసుకుంటున్నారని అలా చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరు తనకు మరో సారి రాజ్యసభ పదవి రాదని మూడేళ్ళ టర్మ్ ఉండగానే చంద్రబాబుకు మేలు జరుగుతుందని సీటు అమ్మేసుకున్నారని వైఎస్.జగన్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ కి విలువ ఏం ఉంటుందన్నారు. తమకు కావాల్సినట్లుగా స్టేట్ మెంట్ ఇస్తే వాసుదేవరెడ్డిని వదిలేసినట్లుగానే కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని కూడా వదిలేసేవారని వైఎస్.జగన్ విమర్శించారు.
