ఇండ్లకే కాదు గుడికి కూడా హైడ్రా నోటీసులు
Is a notice now being issued for a colony established 65 years ago in Alwal, Hyderabad?

ప్రజల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే అధికార పార్టీ నేతలు తన మీద విరుచుకుపడుతున్నారని మల్కజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కని మీద 20 మంది ప్రెస్మీట్ పెడుతున్నారని, అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. ఎంపి ఈటెల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్లో కొందరు నేతలు స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు నేతలు చివరికి కులాల ప్రస్తావన కూడా తీసుకువస్తున్నారన్నారు.
ఈటెల మాటల్లో ముఖ్యాంశాలు
ఇప్పుడు మాట్లాడే మాటలు ముఖ్యమంత్రికి చేరాలని మాట్లాడుతున్నాను. నేను గెలిచి దాదాపు సంవత్సరం అవుతోంది. ప్రత్యక్షంగా ముఖం తెలవకపోయినా తెలంగాణ ఉద్యమ బిడ్డగా గుర్తించి నాకు ఓటు వేసి మల్కాజ్గిరి ప్రజలు గెలిపించారు. నాలుగు లక్షల మెజారిటీతో నన్ను ఆదరించారు. ఎల్బీనగర్లో పోలైన ఓట్లలో 65% ఓట్లు వేసి మెజారిటీని 1 లక్షా 60 వేల మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించారు.
సాధారణంగా ఎంపీలు అంటే చుట్టపు చూపులా ఆరు నెలలకు ఏడాదికి వస్తారు. చుక్కల్లో చంద్రునిలా కనిపిస్తుంటారు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ కి వెళ్లిన రోజు తప్పితే ప్రతిరోజు ఇక్కడే తిరుగుతున్నాను. నేను రాగానే హైడ్రా తీసుకువచ్చారు. నేను అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని కాదు. ఎవరిని నిందించే వాడిని కాదు, ప్లాట్ల దందా రియల్ ఎస్టేట్ దందా చేసేవాడిని కాదు. కబ్జాలు పెట్టేవాడిని కాదు, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనే తపన తప్పా మరో ఆలోచన లేదు.
హైడ్రా మీద నేను ఒక్కడినే కొట్లాడాను. హైడ్రా తీసుకురాగానే చాలామంది సీఎం రేవంత్ రెడ్డిని పొగిడారు. కానీ నేను మాత్రం ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది తప్ప కూల్చదు అన్నాను. ప్రభుత్వం కన్నీళ్లు తుడుస్తుంది తప్ప కన్నీళ్లు పెట్టించదు. ప్రభుత్వం వేదిస్తే అండగా ఉంటుంది తప్పా కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం వేదించదని చెప్పాను.
1965లో హైదరాబాద్ ఆల్వాల్ లో 65 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీకి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. ఇండ్లకే కాదు గుడికి కూడా నోటీసులు అంటించారు. గుడికి ఎవడన్నా నోటీసు అంటిస్తారా. కోపం రమ్మంటే రాదా. దేవాలయాలను కూలగొట్టి సంస్కారం ఉందా ? పేద ప్రజలను వేధించాలని చూస్తే బిజెపి చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం
