నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల – టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థుల జోరు
NEET UG 2025 results released – Telugu students dominate top ranks

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జాతీయ స్థాయిలో మెరిశారు.
వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైన నీట్ అండర్గ్రాడ్యుయేట్ పరీక్షను మే 4న జాతీయ పరీక్షల సంస్థ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు టాప్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) అధికారికంగా ఫలితాలను ప్రకటించగా, తెలంగాణ నుంచి 41,584 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకును సాధించగా.. షణ్ముఖ నిషాంత్ 37వ ర్యాంకు, మంగరి వరుణ్ 46వ ర్యాంకు, యండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంకు సాధించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన దర్బా కార్తీక్రామ్ 19వ ర్యాంకు, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకువచ్చారు.
ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక ‘ఆన్సర్ కీ’ విడుదల చేసిన ఎన్టీఏ, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. నీట్ వేదికపై తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు.
