విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో, పేలుళ్లకు నిధులు సమకూర్చిన ముఠా నేపథ్యం స్పష్టమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ అనే వ్యక్తి సౌదీ అరేబియా నుంచే సిరాజ్ నేతృత్వంలోని అహీం గ్రూపుకు ఆర్థికంగా సహాయం చేసినట్టు అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్థాల కొనుగోలుకు అవసరమైన డబ్బును ఇమ్రాన్ అక్రమ్ పంపినట్టు అన్వేషణలో తేలింది. ఎంత ఖర్చయినా పంపిస్తానంటూ ఇమ్రాన్‌ అక్రమ్‌.. సిరాజ్‌కు హామీ ఇచ్చినట్లు గుర్తించారు.



సిరాజ్ నెట్‌వర్క్‌లో వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదర్ సహా పలువురు యాక్టివ్ మెంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతేడాది చివర్లో ముంబయి, ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి వెళ్లిన సిరాజ్ అక్కడ అద్నాన్ ఖురేషీ, దిల్షన్, మోషిన్ షేక్, జస్సీర్, షమద్, అమీర్ అంసారీ లతో సమావేశమై చర్చించినట్టు ఆధారాలు లభించాయి.



ఈ భయానక కుట్రను ముందుగానే గుర్తించి సిరాజ్, సమీర్ లను అరెస్ట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇప్పుడు వీరికి అన్ని విధాల సహకరించిన నెట్‌వర్క్‌పై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో, ఎవరెవరు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసారో అనే అంశాలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.



విజయనగరం పోలీసులు మొదటగా నమోదు చేసిన కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని దేశ వ్యాప్తంగా ఉన్న సిరాజ్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు రంగంలోకి దిగింది. ఈ కేసులో విదేశీ హ్యాండ్లర్ల పాత్రను కూడా గుర్తించే పనిలో ఎన్ఐఏ ఉంది. అలాగే దేశంలోని ఇతర స్లీపర్ సెల్ సభ్యులను అరెస్ట్ చేసి మరిన్ని కీలక సమాచారం బయటకు తీసే అవకాశముందని అధికారులు ఆశిస్తున్నారు.


Politent News Web4

Politent News Web4

Next Story