The government is preparing to open six more Trupti canteens in Visakhapatnam and Vijayawada.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరులో ప్రారంభించిన తృప్తి క్యాంటీన్లకు మంచి ఆదరణ, స్పందన వస్తోంది. నెల్లూరులో మొదటి తృప్తి క్యాంటీన్ను మే నెల 5న మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ క్రమంలో విశాఖపట్నం, విజయవాడలో మరో ఆరు క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా మహిళలు) సభ్యులకు ఉపాధి కల్పించడం కోసం ఈ క్యాంటీన్లను తీసుకొచ్చారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి పెట్టుబడి నిధి కింద రుణాలు అందిస్తారు.. వాటితో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో 4, విజయవాడలో 2 తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.. వీటికి కావాల్సిన కంటెయినర్లు, మిగిలిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు దాదాపు రూ.13.50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. నగరపాలక సంస్థ స్థలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ క్యాంటీన్లు పెట్టుకోవచ్చు. స్థలానికి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.. విద్యుత్ సరఫరా కూడా ఉచితంగా అందిస్తారు. ఈ క్యాంటీన్లు విజయవంతం అయితే మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు అధికారులు.వీటితో పాటుగా ఈ ఏడాది మార్చి 8 నుంచి జూన్ 8 మధ్య కర్నూలులో 10, ఆదోనిలో 2, ఎమ్మిగనూరులో 1 తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నంద్యాల జిల్లాలో కూడా మరో 10 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ఈ తృప్తి క్యాంటీన్లను నడిపేందుకు స్వయం సహాయక సంఘాల నుంచి ఒక్కో యూనిట్కు నలుగురు మహిళా సభ్యులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం 20 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో కంటెయినర్ను అందిస్తుంది. అలాగే క్యాంటీన్లో అందించే వంటకాలు, నిర్వహణపై శిక్షణ అందిస్తారు. అలాగే పర్యావరణానికి మేలు చేసేలా వంట చేయడానికి ఎలక్ట్రిక్ పరికరాలు.. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పవర్ను కూడా ఉపయోగిస్తారు.ఈ తృప్తి క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటాయి. అలాగే అనుభవజ్ఞులైన చెఫ్లు ఉంటారు.. అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ అందించే ఫుడ్ను తనిఖీ చేస్తారు.. అవసరమైన సూచనలు చేస్తారు. ప్రజలకు సంతృప్తికరమైన భోజనం అందించి.. వారి నుంచి అభిప్రాయాలను తెలుసుకొని క్యాంటీన్లను సమర్థంగా నడిపిస్తారు. ఈ క్యాంటీన్లు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ముఖ్యమైన కూడళ్లలో, హైవేలకు దగ్గరలో ఏర్పాటు చేస్తారు. ఇవి 24 గంటలు పనిచేస్తాయి. మొత్తం మీద తృప్తి క్యాంటీన్లలో రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటుంది.. విశాఖపట్నం, విజయవాడవాసులకు పండగే అని చెప్పాలి.
