24న విచారణకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ తోపాటు ఆయన పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి కూడా నోటీసులు అందజేసింది. ఈనెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున ఆయన వద్దకే వచ్చి స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా బండి సంజయ్ సూచన మేరకు హైదరాబాద్ లోని దిల్ కుష్ ప్రభుత్వ అతిథి గ్రుహంలో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారు. బండి సంజయ్ తోపాటు పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వీరంతా అదే రోజు విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను సిట్ పోలీసులు విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సంగతి విదితమే.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పెట్టిందే బండి సంజయ్

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మొట్టమొదటగా గళం విన్పించిన నేత బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బండి సంజయ్ అనేక ఉద్యమాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పాలకులకు కొరకరాని కొయ్యలా మారిన సంగతి విదితమే. ఈ నేపథ్యలో బండి సంజయ్ ను కట్టడి చేయాలని భావించిన నాటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు ఒడిగట్టింది. తనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్ ప్రభుత్వం తనతోపాటు తన కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ నీచానికి ఒడిగడుతోందని 2022లోనే బండి సంజయ్ సంచలన అరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతోపాటు నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిసహా జడ్జీల, ప్రతిపక్ష పార్టీల నాయకుల, సినీ తారలతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ పలుమార్లు ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం ద్వారానే టెన్త్ పేపర్ లీక్ అనే తప్పుడు కేసు బనాయించి అర్ధరాత్రి తన నివాసంపై దాడి చేసి అరెస్ట్ చేశారని బండి సంజయ్ పేరొన్న సంగతి తెలిసిందే. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో 317 జీవోను సవరించాలంటూ చేపట్టిన దీక్ష జరగకుండా నిలువరించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించి చివరకు టియర్ గ్యాస్ ఆఫీసు గేటు బద్దలు కొట్టి, ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి బండి సంజయ్ ను, బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే సంభాషణలను కూడా ట్యాప్ చేసి అనేక మంది జీవితాల్లో చిచ్చు పెట్టిన దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్ అంటూ బండి సంజయ్ అనేక సభల్లో, మీడియా వేదికల ద్వారా ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపడుతున్న సిట్ పోలీస్ వర్గాలు నాడు బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రత్యర్థులతోపాటు జడ్జీల, సినీ తారల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని, చివరకు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ కు గురయ్యాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ను ఈనెల 24న సిట్ విచారించడంతోపాటు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు బండి సంజయ్ సైతం తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ ముందుంచాలని భావిస్తున్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story