శ్రీపరాభవ నామ సంవత్సర పండగలను ఖరారు చేసిన తెలంగాణ విద్వత్సభ

రాబోయే పరాభవ నామ సంవత్సరంలో ( 2026 -2027 ) వచ్చే పండగల జాబితాను తెలంగాణ విద్వత్సభ నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణారావు కు అందచేసింది. పండగల విషయాల్లో ఏవిధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకై గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్దాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండగల తేదీలను నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. ఇదేవిధంగా రాబోయే పరాభవ నామ సంవత్సర పండగలను దాదాపు వందమంది సిద్ధాంతులు జూలై 13 న పుష్పగిరి జగద్గురు సంస్థానంలో నిర్వహించిన విద్వత్సభ సమావేశంలో ఖరారు చేశారు. ఈ పండగల జాబితాను తెలంగాణా విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి ఆధ్వర్యంలో కోశాదికారి ఎం. వెంకటరమణ శర్మ, సంయుక్త కార్యదర్శి కమలాకర శర్మ, సమన్వయకర్త భీం సేన్ మూర్తి, బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సెంటర్ చైర్మన్ విజయ్ ఒద్దిరాజు లు సి.ఎస్. రామకృష్ణ రావు కు అందచేశారు.
