- అధికార కాంగ్రెస్ పైనా...? ప్రతిపక్ష బిఆర్ఎస్ పైనా...?
- తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం బీజేపీకి సాధ్యమా ?
- కమలనాథుల విమర్శనాస్త్రాల వెనక మర్మమేంటి ?
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి. రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలి పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య అయితే ఛోటా మోటా నాయకుల నుంచి మొదలు పెడితే అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వరకూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే తాజాగా బీజేపీ నేతలు బీఆర్ఎస్ నాయకులపై కూడా మాటల తూటాలు వదులుతున్నారు.
రైల్వే స్టేషన్లు రి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ట్విట్టర్ లో స్పందించే మాజీ మంత్రి తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులు చూడాలని, గతంలో శంకుస్థాపన పనులకు సైతం గత ప్రభుత్వ పెద్దలు రాలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
మరోవైపు బండి సంజయ్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో బీఆర్ఎస్ పైనే విమర్శలు సంధించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ప్రధానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారని.. ఇప్పుడు తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఎవరి హాయంలో బుల్లెట్ దిగిందో చూడాలని ప్రజలను కోరారు బండి సంజయ్.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనలో అధికారులు సకాలంలో స్పందించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్ యుద్ధ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారని సిఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్... రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతీ సందర్భంలో విరుచుకుపడుతున్నారు. హైడ్రా కూల్చివేతలపై సిఎం రేవంత్ రెడ్డిని శాడిస్ట్ అని ఘాటుగా విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లర విమర్శలు మానుకోవాలని ఘాటుగా హెచ్చరించారు.
త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ కష్టపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగకుండా.. ఇలాంటి విమర్శలు ఏ మేరకు పార్టీ క్యాడర్ లో ఏ మేరకు జోష్ పెంచుతాయనేది చూడాలి.
