Abhishek Sharma: అభిషేక్ శర్మ సంచలనం.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు బద్దలు
టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు బద్దలు

Abhishek Sharma: భారత యువ ఓపెనర్, టీ20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం (జనవరి 21) నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఈ 25 ఏళ్ల అమృత్సర్ ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 5000 టీ20 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టులో ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అతను 5000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 82 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 33 బంతుల్లోనే ఆ లక్ష్యాన్ని చేరుకుని ఈ ఘనత సాధించాడు.
ఇప్పటివరకు ఈ ప్రపంచ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ తన 5000 టీ20 పరుగులను పూర్తి చేయడానికి 2942 బంతులను ఎదుర్కోగా, అభిషేక్ శర్మ అంతకంటే తక్కువ బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీ20 క్రికెట్లో తన దూకుడును కొనసాగిస్తూ, అతి తక్కువ కాలంలోనే ఈ రికార్డును తన సొంతం చేసుకోవడం విశేషం.
అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో భారత్ ఈ మ్యాచ్లో పటిష్ట స్థితికి చేరుకోవడమే కాకుండా, అతను సాధించిన ఈ మైలురాయి క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్న అభిషేక్, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.

