Abhishek Sharma: టీమిండియా యువ సంచలనం, విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్‌తో మరోసారి సునామీ సృష్టించాడు! స్థానిక వన్డే టోర్నీలో అమృత్‌సర్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తూ తారన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై పరుగుల వరద పారించాడు. కేవలం 91 బంతుల్లోనే అజేయంగా 233 పరుగులు చేసి అద్భుతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు.ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ బ్యాట్ నుంచి తూటాలు పేలాయి. ఏకంగా 15 ఫోర్లు, ఊహకందనట్లుగా 25 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 256.04 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను ఉతికిపారేసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశాడు.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. జింబాబ్వే పర్యటనలో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేసి నిరాశపరిచాడు. ముజరబానీ బౌలింగ్‌లో ఇబ్బంది పడటం, అంతకుముందు ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలోనూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. గత 10 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేయగలిగాడు. దీంతో ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.

కానీ, ఈ హై-స్పీడ్ డబుల్ సెంచరీతో అభిషేక్ శర్మ తాను మళ్ళీ ఫామ్‌లోకి వచ్చానని ఘనంగా చాటుకున్నాడు. రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లకు ముందు ఈ రికార్డు ఇన్నింగ్స్ అతడిలో రెట్టింపు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, జాతీయ జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో.. అభిషేక్ శర్మ బ్యాట్‌తో ఇచ్చిన ఈ గట్టి సమాధానంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది!

PolitEnt Media

PolitEnt Media

Next Story