Anurag Thakur: ఆసియా కప్: పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ అందుకే ఆడుతోంది - అనురాగ్ ఠాకూర్
భారత్ మ్యాచ్ అందుకే ఆడుతోంది - అనురాగ్ ఠాకూర్

Anurag Thakur: ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్పై భారత క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం. టీమ్ ఇండియా పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు కొనసాగించకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోం
ఈ వివాదంపై మాజీ క్రీడా శాఖ మంత్రి, ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ వంటి సంస్థలు నిర్వహించే అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడం తప్పనిసరి అని ఆయన వివరించారు. ఒకవేళ ఏ జట్టు అయినా మ్యాచ్ ఆడకపోతే, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించి, ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు కేటాయిస్తారని ఆయన తెలిపారు. "పాకిస్తాన్ భారత్పై ఉగ్రవాద దాడులు ఆపేసే వరకు టీమ్ ఇండియా ద్వైపాక్షిక సిరీస్లు ఆడకూడదని మేము ఎప్పటి నుంచో నిర్ణయం తీసుకున్నాం. ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లలో తప్ప, భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్తో ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఆడదు" అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
2012 తర్వాత ద్వైపాక్షిక మ్యాచ్లు లేవు
భారత్, పాకిస్తాన్లు చివరిసారిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్లో తలపడ్డాయి. ఆ తర్వాత ఇరు దేశాలు కేవలం ఐసీసీ, ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి బహుళ-దేశాల టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో మ్యాచ్లను బహిష్కరించాలని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
