కంటతడి పెట్టుకున్న ఆస్ట్రేలియా కామెంటేటర్లు..

Australian Commentators Get Emotional for Kohli and Rohit: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా కామెంటేటర్లు ఇచ్చిన వీడ్కోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఇద్దరు దిగ్గజాలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఉండవచ్చనే భావనతో.. ఆసీస్ వ్యాఖ్యాతలు వారిపై కురిపించిన ప్రశంసలు, భావోద్వేగపూరిత వ్యాఖ్యానం అభిమానుల హృదయాలను తాకాయి. ఈ వ్యాఖ్యానం సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఒకరు కంటతడి పెట్టుకోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

కింగ్ చివరిసారిగా వస్తున్నాడు..

గత వారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్, కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నప్పుడు.. ఎస్ఈఎన్ రేడియో కామెంటేటర్లు ఆడమ్ వైట్, గెరార్డ్ వాట్లీ వారిని ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు ఆడమ్ వైట్ చేసిన వ్యాఖ్యానం అందరినీ కదిలించింది:

‘‘కాస్త ఆగండి.. కెప్టెన్ పెవిలియన్‌కు వెళ్తున్నాడు. కింగ్ భారత జెర్సీలో ఆస్ట్రేలియా గడ్డపై చివరిసారిగా రాబోతున్నాడు. పెద్దలారా.. ఇతడే విరాట్ కోహ్లీ" అని అన్నాడు.

"క్రికెట్‌కు ఈయనే కేంద్ర బిందువు"

ఆస్ట్రేలియా మాజీ పేసర్ ట్రెంట్ కోప్‌లాండ్ కూడా ఈ భావోద్వేగాన్ని పంచుకున్నాడు. "ఇలాంటి క్షణాన్ని చూస్తున్నందుకు మనం అదృష్టంగా భావించాలి. క్రికెట్‌లో పెను మార్పులకు కోహ్లీ కేంద్ర బిందువుగా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ రికార్డు ఇతని సొంతం" అని కోప్‌లాండ్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడి, వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కుమార సంగక్కర రికార్డును అధిగమించడం విశేషం.

భారత్‌కు విజయం అందించిన భాగస్వామ్యం

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (121 నాటౌట్), విరాట్ కోహ్లీ (74 నాటౌట్) రెండో వికెట్‌కు 170 బంతుల్లో 168 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి మెరుపు ప్రదర్శనతో భారత్ 38.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వైట్‌వాష్ అవమానం నుంచి తప్పించుకోగా.. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్, కోహ్లీల అద్భుత ఇన్నింగ్స్‌లు సిడ్నీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story