రోహిత్, విరాట్ ల సరసన

Axar Patel: టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్ ద్వారా అక్షర్ పటేల్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారతదేశం తరఫున 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఐదో క్రికెటర్గా అక్షర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు భారత్ నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వారి సరసన అక్షర్ పటేల్ చేరాడు.
ఈ రికార్డులో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీమిండియాకు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా కెప్టెన్గా వ్యవహరించకుండా 100 టీ20లు ఆడిన మొదటి భారతీయ ఆటగాడు అక్షరే కావడం విశేషం. కొన్ని ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 లో కూడా ఆయన వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, జట్టును నడిపించే అవకాశం మాత్రం రాలేదు. కాగా, భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (159 మ్యాచ్లు) పేరిట ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా (138), విరాట్ కోహ్లీ (125), సూర్యకుమార్ యాదవ్ (113) ఉన్నారు.
ఈ మైలురాయిపై అక్షర్ పటేల్ స్పందిస్తూ, తాను భారత్ తరఫున 100 టీ20లు ఆడుతానని ఎప్పుడూ ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఇంగ్లాండ్ పర్యటన తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, రెండో టీ20 లో తన 100వ వికెట్ సాధించగా, ఇప్పుడు నాల్గో టీ20 లో 100వ మ్యాచ్ ఆడటం ఎంతో ప్రత్యేకంగా ఉందన్నాడు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్లు మరియు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.

