Bengaluru: కోహ్లీపై ఫిర్యాదు..అరెస్ట్ చేస్తారా.?
అరెస్ట్ చేస్తారా.?

Bengaluru:బెంగళూరులో తొక్కిసలాట ఘటనలో బెంగళూరులో కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తొక్కిసలాటకు కోహ్లీ కూడా బాధ్యుడేనని నైజ హోరాటగారర వేదికే అనే సంస్థ తరఫున ఎ.ఎం. వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. కోహ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసిన ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు వెంకటేష్ ఫిర్యాదును కూడా దర్యాప్తు కోసం పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఆర్సీబి బృందం, కెఎస్సీఎ, డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను, విజయోత్సవ ర్యాలీ నిర్వాహకులు DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు అందటం చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ యజమాన్యంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. కోహ్లీపై కేసు నమోదు చేయడంపై సాధ్యమేనా అన్న దానిపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. మరీ కోహ్లీపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
