Thailand Open: థాయ్లాండ్ ఓపెన్లో భారత్కు నిరాశ.. ఫైనల్లో ఓడిన సాత్విక్-చిరాగ్ జోడీ
ఫైనల్లో ఓడిన సాత్విక్-చిరాగ్ జోడీ

Thailand Open: థాయ్లాండ్ ఓపెన్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టికి ఊహించని షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఇండోనేషియా జోడీ చేతిలో భారత్ పరాజయం పాలైంది.
లియో రోలీ కర్నాండో - డానియల్ మార్తిన్ జోడీ వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది మూడో టైటిల్ను నెగ్గాలన్న సాత్విక్ - చిరాగ్ల ఆశలపై ఇండోనేషియా ఆటగాళ్లు నీళ్లు చల్లారు.
మ్యాచ్ విషయానికి వస్తే... మొదటి సెట్లో ఇండోనేషియా జోడీ పూర్తి దూకుడు ప్రదర్శించింది. వారి అటాకింగ్ గేమ్కు భారత ద్వయం నిలవలేకపోయింది. పెద్దగా పోటీ లేకుండానే 12-21 తేడాతో తొలి సెట్ను ఇండోనేషియా కైవసం చేసుకుంది.
అయితే, రెండో సెట్ మాత్రం అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. పట్టుదలగా ఆడిన సాత్విక్-చిరాగ్ జోడీ, చివరి పాయింట్ వరకు హోరాహోరీగా పోరాడారు. ఈ సెట్ను గెలిచి మ్యాచ్లోకి వద్దామని భారత్ ఎంత ప్రయత్నించినప్పటికీ... లియో రోలీ - డానియల్ మార్తిన్ పట్టువిడవలేదు. ఉత్కంఠ పోరులో చివరికి 23-25 తేడాతో రెండో సెట్తో పాటు టైటిల్ను కూడా భారత జోడీ చేజార్చుకుంది. రన్నరప్తోనే భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

