భారత క్రికెట్‌లో కొత్త ఇన్నింగ్స్‌ మొదలు కాబోతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ యువ కెప్టెన్‌ టెస్టు జట్టును నడిపిస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవలే టెస్టులకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ వచ్చే నెల 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే అయిదు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌నే సారథిగా ప్రకటించ వచ్చని అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం అగార్కర్‌తో పాటు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌లను సైతం గిల్‌ కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరగా ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్‌లో భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు రోహిత్‌ అందుబాటులో లేని రెండు మ్యాచ్‌ల్లో సారథ్య బాధ్యతలూ నిర్వర్తించిన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు పగ్గాలివ్వాలనే డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. అయితే, తరచూ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న బుమ్రా మీద సెలక్టర్లు ఎక్కువ భారం మోపాలనుకోవడం లేదంటున్నారు. భవిష్యత్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని గిల్‌నే కెప్టెన్‌గా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో అదిరేలా పెర్‌ఫార్మెన్స్‌ చేస్తున్న తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్‌ జట్టులోకి రావడం లాంఛనమే అంటున్నారు. అటు.. కర్ణాటక బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌కు కూడా మెరుగైన అవకాశాలే ఉన్నాయి. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ, ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా పేస్‌ బృందంలోకి ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్, ఆకాశ్‌ దీప్‌ వచ్చే అవకాశాలున్నాయి.




Politent News Web4

Politent News Web4

Next Story