ఐసీసీ అవార్డ్

Shubman Gill: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జూలై 2025) అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డును గెలుచుకోవడం అతనికి ఇది నాలుగోసారి. దీనితో ఈ పురస్కారాన్ని అత్యధిక సార్లు గెలుచుకున్న తొలి మెన్ క్రికెటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు.

గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచాడు. ఆ సిరీస్‌లో భారత్ తరఫున కెప్టెన్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన గిల్ జూలై నెలలో మూడు టెస్టులు ఆడి 567 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ,రెండు సెంచరీలు ఉన్నాయి. అతని డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.ఈ అవార్డు రేసులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ మల్డర్‌ వంటి ఆటగాళ్లను గిల్ వెనక్కి నెట్టాడు.

ఈ అవార్డు అందుకున్న తర్వాత గిల్ మాట్లాడుతూ, కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే ఈ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు."ఈ సిరీస్‌లో నా బ్యాటింగ్‌పై నాకు చాలా సంతృప్తి ఉంది. నేను కష్టపడి ఆడాను, దాని ఫలితం ఈ అవార్డు రూపంలో వచ్చింది. ఈ పురస్కారం నా భవిష్యత్తు ప్రదర్శనకు మరింత స్ఫూర్తినిస్తుంది."ఈ అవార్డును నా సహచరులకు, కోచ్‌లకు, నా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. వారి మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు అని అన్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story