India vs Sri Lanka Women’s T20I Series 2025: ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. విశ్వవిజేతగా నిలిచిన తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ సిరీస్‌ ఆడబోతోంది. డిసెంబర్‌లో శ్రీలంక మహిళల జట్టుతో టీమ్‌ఇండియా అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నిజానికి ఈ సిరీస్‌ బంగ్లాదేశ్‌తో జరగాల్సి ఉన్నా, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అది వాయిదా పడింది. దీంతో బీసీసీఐ శ్రీలంకతో అయిదు టీ20ల సిరీస్‌ను ఖరారు చేస్తూ, షెడ్యూల్‌ను విడుదల చేసింది.

టీ20 ప్రపంచకప్‌ 2026కు తొలి సన్నాహం

ఈ సిరీస్ ముఖ్యంగా 2026లో జరగబోయే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి తొలి సన్నాహకంగా ఉపయోగపడనుంది. గత టోర్నీలో న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి భారత జట్టు తొలి దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. అంతకుముందు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్ (2–1), ఇంగ్లాండ్ (3–2)తో జరిగిన టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుని ఫామ్‌లో ఉన్నట్లు నిరూపించుకుంది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి.

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందు భారత్.. ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026) మరియు ఇంగ్లాండ్‌తో (మే 2026) కూడా తలపడనుంది.

సిరీస్ పూర్తి షెడ్యూల్

భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లోని మ్యాచ్‌లు విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగనున్నాయి.

డిసెంబర్ 21 - మొదటి టీ20, విశాఖపట్నం

డిసెంబర్ 23 - రెండో టీ20, విశాఖపట్నం

డిసెంబర్ 26 - మూడో టీ20, తిరువనంతపురం

డిసెంబర్ 28 - నాలుగో టీ20, తిరువనంతపురం

డిసెంబర్ 30 - అయిదో టీ20, తిరువనంతపురం

Next Story