Piyush Chawla: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్
క్రికెట్ కు గుడ్ బై

Piyush Chawla:టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రాబోయే రోజుల్లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతానని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ‘మైదానంలో రెండు దశాబ్దాల కెరీర్కు గుడ్బై చెబుతున్నా. అందమైన ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. నేను క్రీజుకు దూరంగా ఉన్నప్పటికీ క్రికెట్ ఎల్లప్పుడూ నాతోనే కొనసాగింది. ఈ అందమైన ఆట స్ఫూర్తి, పాఠాలను నాతో తీసుకెళ్లే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను ఎదురుచూస్తున్నా’ అని చావ్లా వ్యాఖ్యానించాడు.
చావ్లా కెరీర్లో రెండు వరల్డ్ కప్స్ ఉన్నాయి. 2007లో టీ20, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాలో అతను సభ్యుడిగా ఉన్నాడు. మార్చి 2006లో ఇంగ్లండ్పై టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన చావ్లా డిసెంబర్ 2012లో ఇంగ్లండ్పైనే ఆఖరి మ్యాచ్ ఆడాడు. మూడు టెస్ట్ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 2007లో బంగ్లాదేశ్పై తొలి వన్డే ఆడిన పీయూష్ 2011లో నెదర్లాండ్స్పై చివరిసారి బరిలోకి దిగాడు. మొత్తం 25 వన్డేల్లో 38 రన్స్, 32 వికెట్లు తీశాడు. ఏడు టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
‘దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి 2007, 2011 వరల్డ్ కప్స్లో భాగం కావడం వరకు, ఈ అద్భుతమైన ప్రయాణంలో ప్రతి క్షణం ఒక వరం కంటే తక్కువ కాదు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటాయి’ అని చావ్లా రాసుకొచ్చాడు. తన కెరీర్ను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన కోచ్లు, టీమ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఐపీఎల్లో తన సమయాన్ని కెరీర్లోనే ఓ ప్రత్యేక అధ్యాయంగా అభివర్ణించాడు. ‘నాపై నమ్మకం ఉంచిన పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్కు హృదయపూర్వక కృతజ్ఞతలు. తన తండ్రి లేకుంటే ఈ ప్రయాణం అంత సాఫీగా సాగేది కాదని చావ్లా అన్నాడు. తనపై నమ్మకంతో ఓ మార్గాన్ని ఏర్పర్చుకునే అవకాశాన్ని కల్పించాడని చెప్పాడు. 15 ఏళ్ల వయసులో క్రికెట్ను మొదలుపెట్టిన చావ్లా.. ఇండియా, అండర్–19, 22లో యూపీకి ప్రాతినిధ్యం వహించాడు. 2005–06లో చాలెంజర్ సిరీస్లో సచిన్ టెండూల్కర్ను గూగ్లీతో ఔట్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. డొమెస్టిక్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వెయ్యికి పైగా వికెట్లు తీశాడు.
