IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన పియూష్ చావ్లా.. కప్ గుజరాత్దేనా?
కప్ గుజరాత్దేనా?
ఐపీఎల్ 2026 మహా సంగ్రామానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ముస్తాబైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం ఫైనల్ ఫైట్లో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో గుజరాత్ను ఏకంగా 92 రన్స్ తేడాతో ఓడించిన ఆర్సీబీనే అందరి దృష్టిలో హాట్ ఫేవరెట్గా కనిపిస్తోంది. కానీ, టీమిండియా మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా మాత్రం తన ప్రెడిక్షన్తో క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు!
జియోస్టార్ (JioStar) టాక్ షోలో పియూష్ చావ్లా మాట్లాడుతూ.. "ఆర్సీబీ ప్రస్తుతం ఫెంటాస్టిక్ క్రికెట్ ఆడుతోంది. వాళ్ళ బ్యాటర్లు అద్భుత ఫామ్లో ఉన్నారు, బౌలర్లు ప్లాన్స్ పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కానీ, ఈ సీజన్లో నరేంద్ర మోడీ స్టేడియంను గుజరాత్ ఒక అజేయమైన కోటలా మార్చేసింది. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్ల్లో 5 గెలిచారు. హోమ్ అడ్వాంటేజ్, పిచ్ కండిషన్స్పై పట్టుతో పాటు సొంత ఫ్యాన్స్ సపోర్ట్ గిల్ ఆర్మీకి కొండంత అండగా ఉండనుంది. అందుకే నేను ఈ ఫైనల్లో గుజరాత్కు 60 శాతం, ఆర్సీబీకి 40 శాతం గెలిచే ఛాన్స్ ఇస్తున్నాను" అంటూ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఈసారి ఐపీఎల్ ఫైనల్ ఒక విచిత్రమైన రికార్డుకు వేదిక కానుంది. ఈ సీజన్ ప్లేఆఫ్స్ చేరిన నాలుగు జట్లు ఆర్సీబీ, జీటీ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ గతంలో ఒకసారి కప్ గెలిచినవే. కాబట్టి మే 31న జరగబోయే మ్యాచ్లో ఎవరు నెగ్గినా.. వాళ్లకు ఇది రెండో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం.
ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్-1లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 254 పరుగుల కొండంత స్కోరు చేసి గుజరాత్ను చిత్తు చేసింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఫస్ట్ టైటిల్ కొట్టిన బెంగళూరు.. ఈసారి కప్ను డిఫెండ్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరి చావ్లా ప్రెడిక్షన్ నిజమై గిల్ సేన హోమ్ గ్రౌండ్లో కప్ కొడుతుందా?.. లేక రజత్ పాటిదార్, కింగ్ కోహ్లీ ఆర్మీ గుజరాత్ కోటను బద్దలు కొట్టి బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీ నెగ్గుతుందా?చూడాలి.



