ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్!

IPL 2026: ఐపీఎల్-19లో ముంబై ఇండియన్స్కు కోలుకోలేని దెబ్బ! ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై చేతులెత్తేసింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైని భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్తో వణికించాడు. పిచ్పై ఉన్న పగుళ్లను వాడుకుంటూ తొలి ఓవర్లోనే రికెల్టన్ను, మూడో ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లను అవుట్ చేసి ముంబై టాప్ ఆర్డర్ను కకావికలం చేశాడు.
28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును తిలక్ వర్మ, నమన్ ధీర్ ఆదుకున్నారు. తిలక్ వర్మ 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, నమన్ ధీర్ 47 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 82 పరుగులు జోడించడంతో ముంబై కోలుకుంది.
అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లతో చెలరేగాడు. స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి ఛేదించి ముంబై ప్లే ఆఫ్స్ కలలను చెరిపేసింది.ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇలా లీగ్ దశలోనే వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

