IPL 2026: MI vs KKR మ్యాచ్ తర్వాత విషాదం..హోటల్ గదిలో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ మృతి!
హోటల్ గదిలో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ మృతి!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న వేళ.. బ్రాడ్కాస్ట్ టీమ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇంగ్లాండ్కు చెందిన సీనియర్ ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ జాన్ విలియమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 76 ఏళ్ల వయసున్న ఆయన.. ముంబైలోని ఒక హోటల్ గదిలో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. జాన్ విలియమ్ తన హోటల్ గదికి వెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం ఆయనకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. మాస్టర్ కీతో డోర్ తెరిచి చూడగా.. జాన్ విలియమ్ నేలపై పడి ఉండటం గమనించారు.వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు లేనప్పటికీ.. ముంబై పోలీసులు దీనిని అసహజ మరణంగా పరిగణించి కేసు నమోదు చేశారు.దశాబ్దాల కాలంగా బ్రాడ్కాస్టింగ్ రంగంలో విశేష సేవలు అందించిన జాన్ విలియమ్ మృతి పట్ల ఐపీఎల్ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

