జోష్ హేజిల్వుడ్

Josh Hazlewood: ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో అరుదైన ఘనతను సాధించి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరపున 50 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి విదేశీ బౌలర్గా ఆయన రికార్డు సృష్టించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ను అవుట్ చేయడం ద్వారా హేజిల్వుడ్ ఈ 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు.
ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్పై 152 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్ను, హేజిల్వుడ్ తన అద్భుత బౌలింగ్తో ఢిల్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ మొదటి బంతికే పెవిలియన్ చేర్చారు. 2025 ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ తరపున హేజిల్వుడ్కు ఇది 32వ మ్యాచ్ కావడం గమనార్హం. 2022 సీజన్ నుండి బెంగళూరు జట్టుతో కొనసాగుతున్న ఆయన, తన తొలి సీజన్లోనే 12 మ్యాచ్లలో 20 వికెట్లు తీసి సత్తా చాటారు. అయితే గాయాల కారణంగా 2023లో కేవలం 3 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీశారు.
2024 సీజన్కు దూరంగా ఉన్న హేజిల్వుడ్, తిరిగి 2025 ఎడిషన్లో విజృంభించి 12 మ్యాచ్లలో 22 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుత 2026 ఐపీఎల్ సీజన్లో రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టులో ఆడుతున్న ఆయన, ఈ మ్యాచ్కు ముందు వరకు నాలుగు మ్యాచ్లలో నాలుగు వికెట్లు తీశారు. ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే.. యుజ్వేంద్ర చహల్ 139 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, హర్షల్ పటేల్ 99 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్, ఆర్.వినయ్ కుమార్ కూడా హేజిల్వుడ్ కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్నారు, కానీ విదేశీ బౌలర్లలో మాత్రం 50 వికెట్ల మార్కును అందుకున్న ఘనత కేవలం హేజిల్వుడ్కు మాత్రమే దక్కింది.

