ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో భారత్ అదరగొడుతోంది. గురువారం ఒక్కరోజే భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలు సాధించగా, మొత్తం ఆరు పతకాలు వచ్చాయి. తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి వరుసగా రెండో స్వర్ణం సాధించింది. అవినాశ్ సాబ్లే, జ్యోతి యర్రాజి, కుంజా రజితతో కూడిన భారత మహిళల రిలే జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. లాంగ్ జంప్ లో అన్సీ సోజన్ రజతం నెగ్గగా, శైలిసింగ్ కాంస్య పతకం సాధించింది. భారత పురుషుల రిలే టీమ్ రజతం నెగ్గింది.విశాఖకి చెందిన భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటుతూ వరుసగా రెండో స్వర్ణం సాధించింది. 100 మీటర్ల హర్డిల్స్ లో జ్యోతి యర్రాజీ బంగారం ఒడిసిపట్టింది. కేవలం 12.96 సెకన్లలో ముగించి రికార్డ్ టైమింగ్ తో స్వర్ణం కొల్లగొట్టింది. 2022లో చైనాకు చెందిన సున్ యువీ, 1998లో కజకిస్తాన్‌కు చెందిన ఓల్గా షిషిజినాల పేరిట ఉన్న 13.04 సెకన్ల ఛాంపియన్‌షిప్ రికార్డును జ్యోతి యర్రాజీ బద్దలుకొట్టింది. కాగా, 2023లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో జ్యోతి యర్రాజి స్వర్ణం సాధించింది. 100 మీటర్ల హర్డిల్స్ ను కేవలం 13.09 సెకన్లలో పూర్తి చేసింది. ఈ విభాగంలో 2 లేక అంతకంటే ఎక్కువసార్లు స్వర్ణం సాధించిన అయిదో మహిళా అథ్లెట్‌గా నిలిచింది. పథకం గురించి, స్వర్ణం గురించి ఆలోచిస్తే కంగారు మొదలువుతుంది. అందుకే బెస్ట్ టైమింగ్ తో లక్ష్యాన్ని పూర్తిచేయడంపై ఫోకస్ చేయడంతో ఇది సాధ్యమైందని స్వర్ణం నెగ్గిన తరువాత జ్యోతి అన్నారు.స్టీపుల్ చేజ్‌లో భారత్ స్వర్ణం సాధించింది. అవినాశ్ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌ను 8 నిమిషాల 20.92 సెకన్లలో పూర్తి చేసి బంగారం సాధించాడు. గత 36 ఏళ్లలో భారత్‌కు స్టీపుల్ చేజ్ లో స్వర్ణం రావడం ఇది తొలిసారి. మహిళల 4X400 మీటర్ల రిలేలో రజితతో కూడిన టీం స్వర్ణం సాధించింది. కుంజా రజిత, రూపల్, శుభ, జిస్నాలతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 34.18 సెకన్లలో రిలే పూర్తి చేసి పసిడి కొల్లగొట్టింది. భారత పురుషుల జట్టు 4X400 మీటర్ల పరుగులో ధరంవీర్, మను, జయ్, విశాల్ 3 నిమిసాల 3.67 సెకన్లలో పూర్తిచేసి రజతం సాధించారు. 3 నిమిసాల 3.52 సెకన్లతో ఖతార్ స్వర్ణం నెగ్గింది. లాంగ్ జంప్ లో శైలి సింగ్, అన్సీ సోజన్ సత్తా చాటారు. లాంగ్ జంప్ విభాగంలో అన్సీ సోజన్ 6.33 మీటర్లు దూకి రెండో స్థానంలో, శైలి సింగ్ 6.30 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. ముంబై లోని రిలయన్స్ సంస్థ, జాతీయ ఒలంపిక్ సభ్యురాలు నీతా అంబానీ పర్యవేక్షణ లో నిర్వహిస్తున్న అథ్లెటిక్ సెంటర్ లో జ్యోతి యర్రాజి ఉంటోంది. ఆమె అక్కడే శిక్షణ పొందుతోంది. ఒలంపిక్ లో కూడా పాల్గొన్నపుడు అక్కడే ప్రత్యేక శిక్షణ ఇప్పించిన సంగతి తెలిసిందే. ఆసియా ఛాంపియన్ షిప్ అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములనులను కలవనుంది. ఆ తరవాత ఆమె విశాఖకు వస్తారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story