King Kohli’s Six-Hitting Tsunami: కింగ్ కోహ్లీ సిక్సర్ల సునామీ... రికార్డును తిరగరాసిన విరాట్
రికార్డును తిరగరాసిన విరాట్

King Kohli’s Six-Hitting Tsunami: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కింగ్ కోహ్లీ బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలవడమే కాక, కేవలం మూడు మ్యాచ్ల్లోనే తన కెరీర్లో ఒక వన్డే సిరీస్ లేదా టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్ల వ్యక్తిగత రికార్డును బద్దలు కొట్టాడు. తాజాగా ముగిసిన ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఏకంగా 12 సిక్సర్లు కొట్టాడు. వన్డే క్రికెట్లో ఒకే సిరీస్ లేదా టోర్నమెంట్లో కోహ్లీ 10 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టడం ఇది మొదటిసారి. తన పాత రికార్డును ఆయనే బద్దలు కొట్టడం విశేషం. ఇంతకుముందు, 2022-23లో శ్రీలంకపై జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో, 2023 వన్డే ప్రపంచకప్లో విరాట్ అత్యధికంగా తొమ్మిది (9) సిక్సర్లు కొట్టి తన అత్యుత్తమ రికార్డును నెలకొల్పాడు. ఈ సిరీస్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. మొదటి రెండు మ్యాచ్ల్లో వరుసగా రెండు సెంచరీలు (135, 102) సాధించాడు. విశాఖపట్నంలో జరిగిన మూడవ, నిర్ణయాత్మక వన్డేలో, భారత జట్టు 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్తో కలిసి దూకుడుగా ఆడిన కోహ్లీ కేవలం 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో మూడు భారీ సిక్సర్లు కొట్టి సిరీస్లోని తన సిక్సర్ల సంఖ్యను 12కు చేర్చాడు. సిరీస్ విజయానంతరం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, "నిజాయితీగా చెప్పాలంటే, ఈ సిరీస్లో నేను ఆడిన విధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. గత రెండు-మూడేళ్లుగా నేను ఈ స్థాయిలో ఆడలేదు. మైదానంలో నేను చాలా స్వేచ్ఛగా ఉన్నట్లు భావిస్తున్నాను. నేను స్వేచ్ఛగా ఆడినప్పుడే సిక్సర్లు కొట్టగలను అని నాకు తెలుసు," అని తన కొత్త, మరింత దూకుడుగా ఉన్న బ్యాటింగ్ శైలిపై అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్లో కోహ్లీ మొత్తం 302 పరుగులు చేసి, సిరీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని బ్యాటింగ్ సగటు 151.00గా ఉంది.

