టీమిండియా ఆల్‌రౌండర్‌కు స్వల్ప గాయం

Minor Injury for Team India All-Rounder: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివం దూబే స్వల్ప వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు రెండు వారాల ముందే అతనికి ఈ సమస్య వచ్చినట్లు మీడియా కథనాల ద్వారా సమాచారం.

అక్టోబర్ 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు ప్రకటించిన 16 మంది సభ్యుల భారత జట్టులో శివం దూబే ఉన్నాడు.

రంజీ మ్యాచ్ కోసం వెళ్లి..

వాస్తవానికి శివం దూబే రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడాల్సి ఉంది. జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్ కోసం కొన్ని రోజుల క్రితం జమ్మూకు వెళ్లిన దూబే, అక్కడి చల్లని వాతావరణం వల్ల ఇబ్బంది పడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో అతని వెన్ను పట్టేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

గాయం తీవ్రం కాకముందే ముంబై జట్టు జాగ్రత్త పడింది. దీంతో దూబే వెంటనే మంగళవారం ముంబైకి తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం మెడికల్ టీమ్ సలహా మేరకు అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఆస్ట్రేలియా టూర్‌కు ముందు దూబేకు గాయం కావడంతో కొంత ఆందోళన ఉన్నప్పటికీ, సిరీస్ ప్రారంభమయ్యేలోపు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఒక మీడియా కథనం తెలిపింది. ఈ వారం చివరిలోగా శివం దూబే ఫిట్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ముంబై టీమ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story