మిథాలీ రాజ్ స్టాండ్‌

Mithali Raj Stand: భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను సముచిత రీతిలో గౌరవించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సిద్ధమైంది. నగరంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్‌ పేరు పెట్టనున్నారు. భారత క్రికెట్‌లో ఒక మహిళా క్రీడాకారిణి పేరుతో స్టాండ్‌ ఉండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మిథాలీ రాజ్‌ స్టాండ్‌ ఆవిష్కరణ:

ఈ నెల 12న ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా అధికారికంగా ఈ స్టాండ్‌ను ఆవిష్కరిస్తారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మిథాలీ 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 232 వన్డేల్లో 7805 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె కొనసాగుతోంది. ఆమె 155 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2022లో రిటైర్‌ అయిన 43 ఏళ్ల మిథాలీ ప్రస్తుతం క్రికెట్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతోంది.

రావి కల్పనకు కూడా ప్రత్యేక గౌరవం

ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోని మరో స్టాండ్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ రావి కల్పన పేరు కూడా పెట్టనున్నారు. వికెట్‌ కీపర్‌ అయిన కల్పన 2015–16 మధ్య భారత్‌ తరఫున 7 వన్డేలు ఆడింది. ఆమె క్రికెట్‌ గణాంకాలు అసాధారణంగా లేకపోయినా, అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగిన తీరును దృష్టిలో ఉంచుకొని, వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిగా ఆమె పేరుతో స్టాండ్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కల్పన దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర, రైల్వేస్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.

వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు

ప్రస్తుతం విశాఖపట్నంలో భారత మహిళా జట్టు ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతోంది. భారత జట్టు కొలంబో నుంచి వైజాగ్‌కు చేరుకుంది. వైజాగ్‌లో భారత్ ఈనెల 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. కొలంబోలో ఆదివారం పాకిస్తాన్‌ జట్టుతో ఆడిన భారత జట్టు 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story