బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం పెట్టడంపై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది!

Pakistan Cricket Board (PCB): పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తాజాగా బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పేరు లేకపోవడం ప్రపంచ క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా పాకిస్థాన్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, బాబర్‌ను జట్టు నుంచి తొలగించారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే మీర్పూర్ వేదికగా బుధవారం (మార్చి 11) జరగనున్న మొదటి వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ వన్డే కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. బాబర్‌తో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లను ఈ సిరీస్ నుండి తొలగించలేదని, కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

యువతకు అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తు కోసం బలమైన జట్టును సిద్ధం చేయడమే తమ ఉద్దేశమని షాహీన్ వివరించారు. బంగ్లాదేశ్ వంటి జట్లపై ఆడినప్పుడు యువ ఆటగాళ్లకు మంచి అనుభవం లభిస్తుందని, ప్రపంచకప్ నాటికి వారు సిద్ధంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్ ద్వారా బాబర్ ఆజం భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని, అతను జట్టులో కీలక సభ్యుడిగానే కొనసాగుతారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కేవలం రొటేషన్ పాలసీలో భాగంగానే సీనియర్లకు విశ్రాంతినిచ్చి, కొత్త రక్తాన్ని పరీక్షించాలని బోర్డు భావిస్తోంది.

ఈ సిరీస్ ద్వారా సాహిబ్జాదా ఫర్హాన్ వంటి ముగ్గురు యువ ఆటగాళ్లు వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఫర్హాన్, వన్డేల్లో కూడా సత్తా చాటుతాడని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తన సొంత గడ్డపై బలమైన జట్టు అని, ఇటీవల వెస్టిండీస్‌ను కూడా ఓడించిందని షాహీన్ గుర్తు చేశారు. అయితే తాము కూడా వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై సిరీస్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నామని, యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టు ఈ సవాలును అధిగమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story