వైభవ్ సూర్యవంశీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
భారత క్రికెట్లో ప్రకంపనలు రేపుతోన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి పాట్నా ఎయిర్ పోర్టులో ఊహించని అనుభవం ఎదురయ్యింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరంగా సూర్యవంశీకి ఎదురయ్యారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో చూపించిన అద్భుత ప్రతిభతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన వైభవ్ను నరేంద్ర మోదీ అక్కడ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. అతని కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని మోదీ ముచ్చటించారు.
ఈ సన్నివేశాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. యువ క్రికెట్ ప్రతిభావంతుడైన వైభవ్ను కలవడం ఎంతో ఆనందంగా అనిపించిందని, వైభవ్లో ఉన్న నైపుణ్యం, పట్టుదల తనను ఆకట్టుకుందని ప్రధాని పేర్కొన్నారు. చిన్న వయసులోనే క్రికెట్పై అతడికున్న నిబద్ధత చూసి గర్వంగా అనిపించిందని మోదీ ప్రశంసించారు.
వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, ఇలాంటి యువ క్రీడాకారులు భారతదేశ భవిష్యత్తుకు ఆస్తులుగా నిలుస్తారని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్య వంశీకి తన కుటుంబం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కూడా స్ఫూర్తిదాయకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ త్లలిదండ్రులతో కూడా మోదీ ముచ్చటించారు.
వైభవ్ సూర్యవంశీ మరిన్ని విజయాలు సాధించాలని, దేశానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని, అతడి భవిష్యత్ ప్రయాణానికి తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
