Prince Yadav: టీ20 హిస్టరీలో అరుదైన రికార్డు కొట్టిన ప్రిన్స్ యాదవ్!
ప్రిన్స్ యాదవ్!

Prince Yadav: ఐర్లాండ్తో ఆదివారం (జూన్ 28) జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన మూడో భారతీయ క్రికెటర్గా ప్రిన్స్ రికార్డులకెక్కాడు. ఢిల్లీకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జాయింట్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసి తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. తన అరంగేట్రం మ్యాచ్లోనే బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రన్ ఛేజింగ్లో 11వ నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన ప్రిన్స్ యాదవ్కు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా లభించింది.
భారత ఇన్నింగ్స్ ఆఖరి బంతికి స్ట్రైకింగ్కు వచ్చిన ప్రిన్స్, ఐర్లాండ్ బౌలర్ హ్యారీ టెక్టర్ వేసిన ఆ బంతిని సిక్సర్గా మలిచాడు. తద్వారా టీ20ఐ కెరీర్లో ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్, రమణ్దీప్ సింగ్ల సరసన నిలిచాడు. మార్చి 2026లో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్, మార్చి 2021లో ఇంగ్లాండ్పై అరంగేట్రం చేస్తూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. అలాగే నవంబర్ 13, 2024న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రమణ్దీప్ సింగ్.. ఆండిలే సిమలనే బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు వీరిద్దరి తర్వాత ప్రిన్స్ యాదవ్ మాత్రమే ఈ రికార్డును అందుకోవడం విశేషం.
ప్రిన్స్ యాదవ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టుకు మాత్రం నిరాశే మిగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ భారత్పై ఐర్లాండ్ విజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. ఐర్లాండ్ జట్టు హ్యారీ టెక్టర్ (53), బెంజమిన్ కాలిట్జ్ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.

