Pro Kabaddi League: సరికొత్త ఫార్మాట్ తో ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్

Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ను మరింత రసవత్తరంగా మార్చడానికి నిర్వాహకులు కొత్త ఫార్మాట్ను ప్రవేశపెట్టారు. ప్లేఆఫ్స్ ఫార్మాట్ లో మార్పు చేశారు. గతంలో ఆరు జట్లు మాత్రమే ప్లేఆఫ్స్కు అర్హత సాధించగా, ఇప్పుడు మొత్తం 8 జట్లకు అవకాశం కల్పించారు. పాయింట్ల పట్టికలో 5వ నుంచి 8వ స్థానంలో ఉన్న జట్లు 'ప్లే-ఇన్' మ్యాచ్లు ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. 3వ, 4వ స్థానాల్లో ఉన్న జట్లు 'మినీ క్వాలిఫయర్'లో తలపడతాయి. విజేత నేరుగా ముందుకెళ్తుంది. ఓడిన జట్టుకు మరోసారి ప్లేఆఫ్స్ ద్వారా అవకాశం లభిస్తుంది. 1వ, 2వ స్థానాల్లో ఉన్న జట్లు 'క్వాలిఫయర్ 1'లో పోటీ పడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టుకు 'క్వాలిఫయర్ 2' ద్వారా ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. మొత్తంగా, ప్లేఆఫ్స్ దశలో మూడు ఎలిమినేటర్లు, రెండు క్వాలిఫయర్లు ఉంటాయి.
గోల్డెన్ రైడ్
గతంలో ప్లేఆఫ్స్కు మాత్రమే పరిమితమైన టై- బ్రేకర్ను ఇప్పుడు లీగ్ దశ మ్యాచ్లకు కూడా వర్తింపజేయనున్నారు.ఒకవేళ మ్యాచ్ స్కోర్ సమంగా ఉంటే, రెండు జట్లు ఐదు రైడ్లతో కూడిన షూటౌట్లో పాల్గొంటాయి. ఈ రైడ్స్లో ఏ జట్టు ఎక్కువ పాయింట్లు సాధిస్తే, ఆ జట్టు విజేతగా నిలుస్తుంది. ఒకవేళ ఈ షూటౌట్ కూడా టై అయితే, 'గోల్డెన్ రైడ్' నిబంధన వర్తిస్తుంది. ఇందులో ఒక రైడ్లో పాయింట్లు సాధించిన జట్టు గెలిచినట్లుగా ప్రకటిస్తారు.ఈ మార్పుతో లీగ్లో టై అయిన మ్యాచ్ల సంఖ్య తగ్గి, ప్రతీ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారుతుంది. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు, ఓడిన జట్టుకు 0 పాయింట్లు లభిస్తాయి.
ఈ సీజన్లో మొత్తం 108 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి.ప్రతి జట్టు 18 మ్యాచ్లు ఆడుతుంది.ఈ కొత్త ఫార్మాట్ లీగ్కు మరింత ఆసక్తిని తీసుకువస్తుందని, ప్రతి మ్యాచ్లోనూ ఫలితం ఉండటం వల్ల అభిమానులు మరింత ఉత్సాహంగా చూసే అవకాశం ఉంటుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. పీకేఎల్ 12వ సీజన్ ఆగస్టు 29న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది.
