Former Team India all-rounder Irfan Pathan: రిషబ్ పంత్.. టెస్టుల్లో బరిలోకి దిగితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. కానీ, వన్డేలు, టీ20ల విషయానికొచ్చేసరికి పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా సెలక్టర్లు పంత్‌ను పక్కన పెట్టేశారు. ఇవాళ్టి నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. పంత్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం వన్డేల్లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ అని పఠాన్ అన్నాడు. రాహుల్ ఓపెనర్‌గానే కాకుండా.. ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడని మెచ్చుకున్నాడు. అలాగే, టాప్ ఆర్డర్‌లో షార్ట్ బాల్స్ చక్కగా ఆడే ఇషాన్ కిషన్‌ను బ్యాకప్‌గా ఎంచుకోవడం స్మార్ట్ సెలక్షన్ అని.. వన్డేల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంజు శాంసన్ మూడో ఆప్షన్‌గా ఉన్నాడని పఠాన్ విశ్లేషించాడు.

ఇక రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ.. సెలక్టర్లకు పఠాన్ ఒక కీలక విజ్ఞప్తి చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ ఫామ్ బాలేదన్న మాట నిజమే అయినా.. 2027 వన్డే ప్రపంచ కప్ రేసు నుంచి అతడిని పూర్తిగా పక్కన పెట్టొద్దని కోరాడు. గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టు నుంచి బయటకు వెళ్లి.. మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో రాణించి టీమ్‌లోకి వచ్చాడని గుర్తుచేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఝార్ఖండ్‌కు అందించి తన సత్తా చాటాడన్నాడు.

పంత్ కూడా ఇషాన్ కిషన్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. దేశవాళీ క్రికెట్‌లో పరుగులు సాధించి వైట్ బాల్ క్రికెట్లోకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఇర్ఫాన్ పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2024లో చివరి వన్డే ఆడిన పంత్.. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేక లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్సీని కూడా వదిలేశాడు. మరి పఠాన్ అన్నట్టుగా పంత్ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేస్తాడో లేదో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story