Rohit and Kohli Skip: గంభీర్ డిన్నర్ పార్టీకి రోహిత్-కోహ్లీ డుమ్మా..?
రోహిత్-కోహ్లీ డుమ్మా..?

Rohit and Kohli Skip: ఆసియా టీ20 కప్-2025 గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా, ప్రస్తుతం వరుస అంతర్జాతీయ సిరీస్లతో బిజీగా ఉంది. ఇప్పటికే వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి జయభేరి మోగించిన భారత జట్టు, అక్టోబరు 10 నుండి 14 వరకు ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్టోబరు 15న ఆసీస్కు బయల్దేరనుంది.
గంభీర్ డిన్నర్ పార్టీ... రో-కో గైర్హాజరు..
టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కావడానికి ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ తన నివాసంలో భారత జట్టుకు డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఈ సమయంలో భారత క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆసీస్ టూర్కు ముందే వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మపై బీసీసీఐ వేటు వేసి, గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది. రోహిత్ను కేవలం ఓపెనర్గా జట్టులోకి తీసుకుంది. ఈ నిర్ణయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ కలిసే రోహిత్పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నిలిచారు.
రోహిత్, కోహ్లి నిర్ణయం ఇదే..
ఈ నేపథ్యంలోనే టీమిండియా కంటే ఒక రోజు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో గంభీర్ తన టీమ్ కోసం డిన్నర్ పార్టీ ప్లాన్ చేయడం.. రోహిత్-కోహ్లి గైర్హాజరు కావడం.. జట్టులో ఏదో జరుగుతోందన్న సందేహాలకు మరోసారి తావిచ్చింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు గంభీర్తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.
ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్
అక్టోబరు 19 నుండి నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మొదట మూడు వన్డేల సిరీస్, ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇరు దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.
