భారీ ఆధిక్యంలో భారత్‌..

Second Test against West Indies: వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దూసుకుపోతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ అదే సీన్‌ రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్.. బౌలింగ్‌లోనూ కరీబియన్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 140/4 స్కోరుతో నిలిచింది. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.

జడేజా మాయాజాలం..

భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/37) బంతితో అద్భుతం చేశాడు. అతని దెబ్బకు విండీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడలేకపోయారు. జాన్‌ కాంప్‌బెల్ (10), త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (34)లను జడేజా పెవిలియన్‌కు పంపాడు. కాంప్‌బెల్‌ను సాయి సుదర్శన్ అద్భుతమైన ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ క్యాచ్‌తో ఔట్ చేయగా, చందర్‌పాల్ కేఎల్ రాహుల్‌కు చిక్కాడు. ఆ తర్వాత అథనాజ్‌ (41)ను కుల్‌దీప్ యాదవ్ వెనక్కి పంపగా, తర్వాతి ఓవర్‌లోనే రోస్టన్ ఛేజ్ (0) జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం టెవిన్ ఇమ్లాచ్‌ (14), షైయ్ హోప్ (31) క్రీజులో ఉన్నారు.

జైశ్వాల్ డబుల్ మిస్.. గిల్ సెంచరీ!

అంతకుముందు 318/2తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా మరో 200 పరుగులు జోడించింది. ఓవర్‌నైట్ స్కోరు 173తో బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ (175) డబుల్ సెంచరీకి అతి చేరువలో రనౌట్‌గా వెనుదిరగడం అభిమానులను నిరాశపరిచింది. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. వీరితో పాటు నితీశ్ రెడ్డి (43), ధ్రువ్ జురెల్ (44) కూడా అర్ధ శతకాల ముంగిట ఔటయ్యారు. భారత్ ప్రస్తుతం పటిష్టమైన స్థితిలో ఉండగా, మూడో రోజు ఆటపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story