Shockwaves in Women’s Cricket: మహిళా క్రికెట్లో వేధింపుల సెగ.. బోర్డు నివేదికపై బంగ్లా మాజీ కెప్టెన్ అసంతృప్తి!
బోర్డు నివేదికపై బంగ్లా మాజీ కెప్టెన్ అసంతృప్తి!

Shockwaves in Women’s Cricket: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జహనారా ఆలం, తనపై జరిగిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) జరిపిన విచారణ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. 2022 మహిళా ప్రపంచకప్ సమయంలో జరిగిన ఈ సంఘటనపై బోర్డు వెల్లడించిన నివేదిక "నిరాశాజనకంగా" ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
హైకోర్టు మందలింపు తర్వాత, ఈ వేధింపుల ఆరోపణలపై విచారణకు బీసీబీ ఒక స్వతంత్ర విచారణ కమిటీని నియమించింది. ఫిబ్రవరి 3న బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జహనారా చేసిన నాలుగు ప్రధాన ఆరోపణల్లో రెండింటికి ఆధారాలు లేవని, మిగిలిన రెండింటిలో అప్పటి మహిళా జట్టు సెలెక్టర్ మరియు మేనేజర్ మొంజూరుల్ ఇస్లాం ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపింది. అతని ప్రవర్తన వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అది వేధింపుల కిందకే వస్తుందని కమిటీ పేర్కొంది.
అయితే, ఈ విచారణ ప్రక్రియపై జహనారా తరపు న్యాయవాదులు 'మహబూబ్ అండ్ కంపెనీ' అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8న విడుదల చేసిన ప్రకటనలో, విచారణ నివేదికకు సంబంధించి జహనారాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుగా నివేదికను పొందే హక్కు ఆమెకు ఉన్నప్పటికీ, బోర్డు కనీసం నివేదికలోని భాగాలను కూడా పంచుకోలేదని ఆరోపించారు.
బోర్డు తన పత్రికా ప్రకటనలో ఏ ఆరోపణలు నిజమని తేలాయి, ఏవి తేలలేదు అనే విషయాలను స్పష్టంగా వెల్లడించకపోవడం పారదర్శకత లోపానికి నిదర్శనమని జహనారా తరపు బృందం విమర్శించింది. దీనిపై వివరణ కోరుతూ బోర్డుకు ఈమెయిల్ చేయగా, మీడియాకు సమాచారం ఇవ్వడం సాధారణ ప్రక్రియేనని, ప్రస్తుతం చట్టపరమైన బృందం నివేదికను సమీక్షిస్తోందని బీసీబీ బదులిచ్చింది.
ఇంతటి తీవ్రమైన విషయంలో విచారణ బాధితులకు అనుకూలంగా, న్యాయబద్ధంగా ఉండాలని జహనారా ఆలం డిమాండ్ చేశారు. తదుపరి చర్యలు తీసుకునే ముందు తనకు నివేదిక పూర్తి వివరాలను అందజేయాలని, నిందితుడిపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో స్పష్టం చేయాలని ఆమె కోరారు.

