శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. రేపు (జనవరి 14, 2026) రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో అయ్యర్ మరో 34 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 3,000 పరుగుల మైలురాయిని అందుకున్న భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధావన్ (72 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ (75 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు 68 ఇన్నింగ్స్‌ల్లో 2,966 పరుగులు చేశారు. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధిస్తే కేవలం 69 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుంటారు. తద్వారా ధావన్, కోహ్లీలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటారు. శ్రేయాస్ అయ్యర్34 పరుగులు చేస్తే 3,000 క్లబ్‌లో చేరతారు. ఈ ఘనత సాధిస్తే వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా 4వ వేగవంతమైన బ్యాటర్‌గా నిలుస్తారు (హాషిమ్ ఆమ్లా 57 ఇన్నింగ్స్‌లతో మొదటి స్థానంలో ఉన్నారు). అక్టోబర్ 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ప్లీహము (Spleen) గాయానికి గురైన అయ్యర్, సుదీర్ఘ విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ఫిట్‌నెస్ నిరూపించుకుని జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 49 పరుగులతో ఆకట్టుకున్నారు. కాగా భారత్ ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అదే సమయంలో అయ్యర్ తన వ్యక్తిగత రికార్డుతో గబ్బర్, కోహ్లీలను అధిగమిస్తారో లేదో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story