Shubman Gill: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 28 బంతుల్లో 28 పరుగులు చేసి, ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35 పరుగులు)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ ఐదు ఫోర్లు బాదాడు.

ఈ ఇన్నింగ్స్ ద్వారా శుభ్‌మన్ గిల్ 2025 సంవత్సరంలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. భారత్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్ ఈ ఏడాది ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 35 మ్యాచ్‌లలో 1764 పరుగులు సాధించాడు.

2025లో గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌లలో 983 పరుగులు చేశాడు. ఇక వన్డేలలో 11 మ్యాచ్‌లలో 490 పరుగులు రాబట్టాడు. అయితే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ ఏడాది 15 టీ20 మ్యాచ్‌లలో అతను 291 పరుగులు మాత్రమే చేసి, ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు.

అత్యధిక అంతర్జాతీయ పరుగుల జాబితాలో గిల్ తర్వాత వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ శై హోప్ ఉన్నాడు. ఈ ఏడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు రేసులో ముందున్న హోప్, 41 మ్యాచ్‌లలో 1753 పరుగులు సాధించి గిల్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ ఏడాది గిల్ ఇంకా రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది, కాబట్టి అతను 2025ను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ముగించేందుకు మంచి అవకాశం ఉంది. అతని ప్రధాన పోటీదారు శై హోప్ కూడా 2025లో వెస్టిండీస్ తరపున ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story