South Africa Creates New History: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌పై జరిగిన ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం (డిసెంబర్ 11, 2025) మొహాలీలోని ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సఫారీ జట్టు 51 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయం ద్వారా దక్షిణాఫ్రికా జట్టు పలు అరుదైన రికార్డులను తమ పేరిట నమోదు చేసుకుంది. భారత్ గడ్డపై టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 50 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓటమిపాలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. ఇంతకుముందు భారత్‌పై అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన రికార్డు కూడా దక్షిణాఫ్రికా (49 పరుగులు, 2022లో ఇండోర్‌లో) పేరిటే ఉండేది. ఈ విజయంతో, దక్షిణాఫ్రికా టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక మ్యాచ్‌లు (మొత్తం 13 విజయాలు) గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ (చెరో 12 విజయాలు) రికార్డులను అధిగమించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ముఖ్యంగా క్వింటన్ డి కాక్ (46 బంతుల్లో 90 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో, సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 214 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ (62 పరుగులు) పోరాడినా, 19.2 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో ఓట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-1తో సమమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story