Bengaluru:మాటలు రావడం లేదు..కోహ్లీ, సచిన్ ఎమోషనల్
కోహ్లీ, సచిన్ ఎమోషనల్

Bengaluru:ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు విషాదంగా మారాయి. స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. నిర్వాహకులు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని బీసీసీఐ సహా ఐపీఎల్ బోర్డు ఆరోపించాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, సీఎం సిద్ధరామయ్య సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో విషాద ఘటపై విరాట్ కోహ్లీ స్పందించాడు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నాడు. ఈ ఘటనతో మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అటు ఆర్సీబీ మేనేజ్మెంట్ సైతం అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ‘‘తొక్కిసలాట ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులకు పూర్తి సహకరిస్తాం’’ అని ఆర్సీబీ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఈ దుర్ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ విచారం వ్యక్తం చేశారు. ‘చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. బాధిత కుటుంబాలను తలుచుకుని నా హృదయం విలపిస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని సచిన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని.. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
