Sreesanth Gets Emotional: భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్ విజేత ఎస్. శ్రీశాంత్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని జైలుకు వెళ్లిన సమయంలో తన భార్య భువనేశ్వరి అందించిన అండ వల్లే తాను ఈరోజు బతికున్నానని ఆయన వెల్లడించారు. జైలులో ఉన్నప్పుడు తాను ఆత్మహత్య చేసుకోకపోవడానికి తన భార్యే ప్రధాన కారణమని శ్రీశాంత్ ఒక తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

తాను జైలు శిక్ష అనుభవిస్తున్న కఠిన పరిస్థితుల్లో కూడా భువనేశ్వరి మరియు ఆమె కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని శ్రీశాంత్ చెప్పారు. "ఆమె 10వ తరగతి చదువుతున్నప్పటి నుండి మా మధ్య పరిచయం ఉంది. మేము 2010లోనే ఒకరికొకరు ఒక వాగ్దానం చేసుకున్నాము. 2011 వన్డే ప్రపంచకప్ గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత 2013లో నా జీవితం తలకిందులైంది. జైలు గోడల మధ్య ఉన్నప్పుడు నా మానసిక స్థితి అస్సలు బాలేదు. కానీ, 2010లో నేను ఆమెకు ఇచ్చిన మాట మాత్రమే నన్ను ఆత్మహత్య ఆలోచనల నుండి వెనక్కి లాగింది" అని శ్రీశాంత్ వివరించారు.

తన కెరీర్ ముగిసిపోయి, బెయిల్‌పై బయట ఉన్న క్లిష్ట సమయంలో కూడా ఆమె కుటుంబం వెనకడుగు వేయకుండా వివాహానికి అంగీకరించిందని ఆయన కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. 2012లో తనకు జరిగిన మేజర్ సర్జరీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినప్పుడు కూడా ఆమె తన చేయి వదల్లేదని, తనకు బెయిల్ రావడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించిందని శ్రీశాంత్ కొనియాడారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడైన శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధం ఆ తర్వాత తొలగించబడగా, ఆయన మార్చి 2022లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story